కుంభమేళాకు రారండోయ్... యూపీ సర్కార్ పిలుపు
ఉత్తరప్రదేశ్ : మకర సంక్రాంతి నాడు ప్రారంభమైన అర్ధ కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ (అలహాబాద్ పేరు మార్పు) లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కుంభమేళాకు సర్వం సిద్ధం చేసింది యూపీ సర్కార్. ప్రపంచవ్యాప్తంగా తరలివచ్చే భక్తులకు, యాత్రీకులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తిచేసింది. జనవరి 15 నుంచి మార్చి 4 వరకు 49 రోజుల పాటు కుంభమేళా జరగనుంది. దాదాపు 192 దేశాల నుంచి ఈ ఆధ్యాత్మిక వేడుకకు 12 కోట్ల మంది వరకు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
450 ఏళ్ల చరిత్రలో ఇదే ప్రథమం
పన్నెండేళ్లకోసారి పూర్ణ కుంభమేళా నిర్వహించడం ఆనవాయితీ. అర్ధ కుంభమేళాను ఆరేళ్లకోసారి నిర్వహిస్తుంటారు. ఈ లెక్కన 2013లో పూర్ణ కుంభమేళా జరిగింది. దాంతో ఈసారి అర్ధ కుంభమేళా నిర్వహిస్తున్నారు. అయితే శతాబ్ధాల కిందటే సాధు-సంత్ మండలి నిర్ణయించిన మేరకు ఈ అర్ధ కుంభమేళా జరుపుతున్నారు. హరిద్వార్, ప్రయాగ్రాజ్, నాసిక్, ఉజ్జయిని.. ఈ నాలుగు ప్రాంతాల్లో గ్రహాలను అనుసరించి కుంభమేళా జరుగుతుంటుంది. అర్ధ కుంభమేళా మాత్రం ప్రయాగ, హరిద్వార్ లో మాత్రమే జరుగుతుంది.
కుంభమేళాను 2017లో సాంస్కృతిక వారసత్వ సంపదగా గుర్తించింది యునెస్కో. ఈసారి జరుగుతున్న కుంభమేళాకు ఓ ప్రత్యేకత ఉంది. ఎన్నడూలేని విధంగా అక్షయ్ వాత్, సరస్వతి కూప్ దగ్గర పూజలు చేసుకునే విధంగా అనుమతిస్తున్నారు. 450 ఏళ్ల కుంభమేళా చరిత్రలో ఈ ఛాన్సివ్వడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
ముక్కోటి దేవతలు ఇక్కడే...!
త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తే పుణ్యం వస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ప్రధానంగా మకర సంక్రాంతి పర్వదినాల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తే.. సకల పాపాలు తొలగిపోయి ఎక్కువ పుణ్యం లభిస్తుందనేది నమ్మకం. దీని ఫలితంగానే కుంభమేళా సందర్భంగా నది తీరాలకు భక్తులు పోటెత్తుతారని ప్రతీతి. కుంభమేళా సందర్భంగా ముక్కోటి దేవతలు త్రివేణి సంగమంలో కొలువుదీరుతారని, వాళ్లను స్మరిస్తూ పుణ్య కార్యక్రమాలు చేస్తే మానవజన్మకు పరమార్థం దొరుకుతుందని చెబుతుంటారు పెద్దలు. ఈ 48 రోజుల పాటు ప్రపంచం నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు ఇక్కడకు వస్తుంటారు.
గ్రామానికి ఒక్కరైనా..! వీలు చూసుకుని రండి
కుంభమేళాను విజయవంతం చేసేలా యూపీ సర్కార్ 3 నెలలుగా ప్రచారం హోరెత్తించింది. ఈసారి 12 నుంచి 15 కోట్ల మంది వరకు రావొచ్చనేది ప్రభుత్వ అంచనా. దేశవ్యాప్తంగా దాదాపు 6 లక్షల గ్రామాలు ఉన్నాయని.. ఒక్కో ఊరి నుంచి కనీసం ఒక్కరైనా ఈ కుంభమేళాకు హాజరుకావాలని పిలుపునిచ్చింది. జనవరి 15 నుంచి మార్చి 4 వరకు దాదాపు 49 రోజుల పాటు జరగనున్న ఈ ఆధ్యాత్మిక వేడుకకు వీలుచూసుకుని ఎప్పుడైనా ఓసారి కచ్చితంగా రావాలని కోరింది.