భార్య గర్భాన్ని నిలువునా చీల్చిన కిరాతకుడు: ఆడో, మగో డౌట్: లింగ నిర్దారణ: అయిదుమంది ఆడపిల్లలు
లక్నో: ఉత్తర ప్రదేశ్లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఊహించుకోవడానికే వణుకు పుట్టించే ఉదంతం అది. పుట్టబోయే బిడ్డ ఆడో, మగో తెలుసుకోవడానికి దారుణ కృత్యానికి పాల్పడ్డాడో కిరాతకుడు. భార్య గర్భాన్ని నిలువునా కోశాడు. భ్రూణ హత్యకు పాల్పడ్డాడు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయించినప్పటికీ..పుట్టబోయే బిడ్డ జెండర్ ఏమిటో ఆసుపత్రుల్లో వెల్లడించకపోవడం వల్ల తానే స్వయంగా తెలుసుకోవడానికి ఈ దుర్మార్గపు చర్యకు తెగబడ్డాడు. సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. అతని భార్యను ఆసుపత్రికి తరలించారు.
ఆడో, మడో తెలుసుకోవడానికి..
ఉత్తర ప్రదేశ్లోని బుదౌన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ కిరాతకుడి పేరు పన్నాలాల్. బుదౌన్లోని నెక్పూర్ ప్రాంతంలో భార్య అనిత, పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. అతనికి అప్పటికే అయిదుమంది ఆడపిల్లలు ఉన్నారు. కుమారుడు పుట్టాలనే ఉద్దేశంతో పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించలేదు. ఆరోసారి అతని భార్య గర్భం దాల్చింది. ఆమెకు ఏడునెలలు నిండాయి. లింగ నిర్ధారణ పరీక్షలను చేయించినప్పటికీ.. పుట్టబోయే బిడ్డ ఆడో, మగో ఎవరూ నిర్ధారించలేదు. కుమారుడు పుట్టకపోతే ఇంట్లో నుంచి వెల్లగొడతానంటూ భార్యతో తరచూ గొడవ పడేవాడు.
మగబిడ్డ కోసం తరచూ ఘర్షణ..
ఇదే విషయంపై మరోసారి పన్నాలాల్, అనిత మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సందర్భంగా తీవ్ర ఆగ్రహానికి లోనైన పన్నాలాల్ పుట్టబోయే బిడ్డ ఆడో, మగో తానే స్వయంగా తెలుసుకుంటానని హెచ్చరించాడు. అక్కడితో ఆగలేదు. పదునైన కత్తితో అనిత కడుపును చీల్చాడు. ఈ ఘటనలో అనిత తీవ్రంగా గాయపడింది. ఆమె గట్టిగా కేకలు పెట్టడంతో చుట్టుపక్కల వారు ఆమె ఇంటికి చేరుకున్నారు. పన్నాలాల్ నుంచి ఆమెను విడిపించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఆందోళనకరంగా
సమాచారం అందుకున్న వెంటనే సివిల్ లైన్స్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పన్నాలాల్ను అరెస్టు చేశారు. బాధితురాలిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మరింత మెరుగైన వైద్యం కోసం బరేలీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. అనిత సోదరుడి ఫిర్యాదు మేరకు సివిల్ లైన్స్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పన్నాలాల్ను అరెస్టు చేశారు.
Recommended Video
నేరాన్ని అంగీకరించినట్లు వెల్లడించిన ఎస్పీ..
నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడని, మగ పిల్లవాడు పుట్టకపోతే.. తన వంశం అంతమైపోతుందనే ఆందోళనతోనే తాను ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వెల్లడించాడని ఎస్పీ ప్రవీణ్ సింగ్ చౌహాన్ తెలిపారు. మగ పిల్లవాడు పుడతాడనే ఆశతోనే తాను పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించలేదని పేర్కొన్నట్లు చెప్పారు. ఇప్పటికే పన్నాలాల్కు అయిదుమంది ఆడపిల్లలు ఉన్నారని, పెద్ద కుమార్తెకు వివాహం జరిపించాడని చౌహాన్ చెప్పారు. ప్రస్తుతం అనిత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. బరేలీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని అన్నారు.