అర్ధరాత్రి ప్రియురాలి ఇంట్లోకి దూరిన ప్రియుడి కళ్లు పెరికేశారు, యువతిపై రేప్ యత్నమని..
లక్నో: ఉత్తర ప్రదేశ్లో ఘోరం జరిగింది. ఓ యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. అయితే యువతి తరఫు బంధువులు ఆ ప్రేమికుడి కళ్లు పీకేశారు. ఈ సంఘటన యూపీ రాజధాని లక్నోకు 125 కిలోమీటర్ల దూరంలోని హర్దోలీ పట్టణంలో జరిగింది.
ప్రేమికుడు తన ప్రియురాలిని కలుసుకునేందుకు ఆమె ఇంటికి రాత్రి సమయంలో చేరుకున్నాడు. దీనిని గమనించిన ప్రియురాలి కుటుంబ సభ్యులు అతనిని పట్టుకుని చావబాదారు. ఆ తర్వాత అతని కళ్లను పెరికివేశారు. అతనిని రోడ్డు పక్కగా విసిరేసి అక్కడి నుంచి పారిపోయారు. అతనిని కొందరు ఆసుపత్రిలో చేర్చారు.
హర్దోలీకి చెందిన యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఒక యవతి ప్రేమలో పడ్డారు. రెండు నెలల క్రితం వారు ఇంటి నుంచి పారిపోయి పదిహేను రోజుల క్రితం తిరిగి తమ తమ ఇళ్లకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఆ యువకుడు గత గురువారం రాత్రి సమయంలో తన ప్రియురాలిని కలుసుకునేందుకు వెళ్లాడు.
అప్పుడు దాడి జరిగింది. అతనిపై ఐరన్ రాడుతో దాడి చేశారు. విషయం తెలుసుకున్న బాధితుని బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు సంఘటనా స్థలానికి వచ్చి బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, అర్ధరాత్రి పూట వచ్చి తమ కూతురుపై అత్యాచార ప్రయత్నం చేశాడని యువతి తరఫు వారు చెబుతున్నారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు.