సెక్స్కు అంగీకరించలేదని భార్య దారుణ హత్య
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ తాగుబోతు భర్త తన లైంగిక వాంఛ తీర్చలేదన్న అక్కసుతో భార్యను హతమార్చాడు. అంతకుముందు మద్యం మత్తులో ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు.
అంతేగాక, రక్తపు మడుగులో పడి ఉన్న ఆమె మృతదేహం పక్కనే కూర్చొని లోపల గడియ వేసుకున్నాడు నిందితుడు. దీంతో అతగాడిని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చింది. హత్య చేసిన తర్వాత ఆరు గంటలపాటు నిందితుడు ఆమె పక్కనే కూర్చున్నాడు.
ఘటనను గమనించిన బాధితురాలి ఇంటికి సమీపంలోనే ఉండే ఆమె సోదరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. మృతురాలికి పదేళ్ల కొడుకు ఉన్నాడు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. బరేలిలోని నారియావాల్ జిల్లాకు చెందిన రాజీవ్ శర్మ విపరీతంగా మద్యం తాగి భార్యతో గొడవకు దిగాడు. అతని కోరికను ఆమె తిరస్కరించింది. దీంతో ఆగ్రహానికి గురైన రాజీవ్ శర్మ ఆమెపై దాడికి దిగాడు.
అంతేగాక, ఆమెను లైంగికంగా దారుణంగా హింసించాడు. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె మృతి చెందింది.
‘బాధితురాలి శరీరంపై గాయాలు లేవు గానీ, విపరీతమైన రక్తస్రావంతోనే కన్నుమూసిందని పోలీసు అధికారి సంతోష్ కుమార్ తెలిపారు. కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించినట్టు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.