సిబ్బందితో చెప్పులు తుడిపించుకున్న మంత్రి, ఆయన ఏం చెప్పారంటే?
లక్నో: ఉత్తర ప్రదేశ్లో ఓ మంత్రి తన సిబ్బంది చేత చెప్పులు తుడిపించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్లో వైరల్గా మారింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో సదరు మంత్రి వివరణ ఇచ్చారు. తాను ఎవరితోను చెప్పులు తుడిపించుకోలేదని, తానే శుభ్రం చేసుకున్నానని చెప్పారు.
మంత్రి రాజేంద్ర ప్రతాప్ సింగ్ కుషినగర్లోని ఓ కాలేజీలో మొక్కలు నాటే కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం ఆయన తిరిగి వెళ్తున్నారు. ఆ సమయంలో పక్కన విడిచిపెట్టిన చెప్పులపై పడిన మట్టి, నీళ్లను సిబ్బంది తువ్వాలుతో శుభ్రం చేశారు.
దీనిని మీడియా ప్రసారం చేసింది. ఆ తర్వాత వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దుమారం చెలరేగింది. మంత్రి ఇలా ప్రవర్తించడంపై చాలామంది మండిపడ్డారు. దీంతో సదరు మంత్రి వివరణ ఇచ్చారు.
తాను చెప్పులను శుభ్రం చేయాల్సిందిగా సిబ్బందికి చెప్పలేదని తెలిపారు. నీళ్లు, మట్టి పడటంతో తన చెప్పులను తానే శుభ్రం చేసుకున్నానని అన్నారు.