అసెంబ్లీలో హాయిగా కునుకేసిన ఎమ్మెల్యేలు: అంత సీరియస్ చర్చ జరుగుతుంటే!..
ప్రజాప్రతినిధులు పనితీరును ప్రజలు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో యోగి ఈ నిర్ణయం తీసుకోగా.. ఆయన నమ్మకాన్ని వమ్ము చేస్తూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు నిద్రలోకి జారుకోవడం చర్చనీయాంశంగా మారింది.
లక్నో: ఓవైపు జీఎస్టీ బిల్లుపై అసెంబ్లీలో సీరియస్గా చర్చ, మరోవైపు విపక్ష సభ్యుల ఆందోళన నడుమ.. కొంతమంది ఎమ్మెల్యేలు సాఫీగా కునుకుతీయడం చర్చనీయాంశంగా మారింది. యూపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే సభలో ఈ దృశ్యం కనిపించింది.
బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఈ తొలి సమావేశాలను.. యూపీ అసెంబ్లీ చరిత్రలో తొలిసారిగా లైవ్ టెలికాస్ట్ చేశారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు తమ సీట్లలోనే గాఢ నిద్రలోకి జారిపోవడం స్పష్టంగా కనిపించింది. గతంలో యూపీ అసెంబ్లీ సమావేశాలను లైవ్ టెలికాస్ట్ చేయాలన్న ప్రయత్నాలు జరిగినప్పటికీ.. యోగి సీఎం అయిన తర్వాతే ఈ నిర్ణయం ఆచరణకు నోచుకుంది.
ఈ మేరకు దూరదర్శన్ చానెల్ యూపీ అసెంబ్లీ సమావేశాలను లైవ్ ప్రసారం చేస్తోంది. కాగా, తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలను టీవీల్లో చూద్దామనుకున్న ప్రజలు.. తమ ఎమ్మెల్యేలు కునుకు తీయడం చూసి ఆశ్చర్యపోయారు. కునుకు తీసినవారిలో ఓ మంత్రి కూడా ఉండటం గమనార్హం.
ప్రజాప్రతినిధులు పనితీరును ప్రజలు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో యోగి ఈ నిర్ణయం తీసుకోగా.. ఆయన నమ్మకాన్ని వమ్ము చేస్తూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు నిద్రలోకి జారుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇకపోతే కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ బిల్లును అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఆమోదించే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే యూపీ ప్రభుత్వం కూడా అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసింది.