రామ నవమి నాడు రామజన్మభూమి ఎలా ఉందంటే..?: కళ తప్పిన అయోధ్య.. నిర్మానుష్యంగా!
లక్నో: శ్రీరామ నవమి పండగ నాడు కోటి కాంతులతో వెలిగి పోవాల్సిన ప్రదేశం అది. జై శ్రీరామ్ అనే నినాదాలతో మారమోగిపోవాల్సిన పుణ్యభూమి అది. శతాబ్దాల నాటి రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదానికి ఎట్టకేలకు తెర పడిన వేళ.. వేలాది మంది భక్తుల మధ్య రామ మందిర నిర్మాణానికి పునాదులు పడాల్సిన చోట.. ప్రస్తుతం నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. రామనవమి ఉత్సవాలతో కళకళలాడాల్సిన అయోధ్య.. ప్రస్తుతం వెలవెలబోతోంది. దీనికి కారణం ఏమిటనే విషయాన్ని ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు.
ఢిల్లీ మత ప్రార్థనల కోసం వచ్చి.. మసీదుల్లో మకాం వేసిన విదేశీయులు: జాయింట్ సెర్చ్ ఆపరేషన్.. !
ఇళ్లకే పరిమితమైన అయోధ్యవాసులు..
భయానక కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. ఈ మహమ్మారిని అడ్డుకట్ట వేయడానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించింది. ఈ 21 రోజుల వ్యవధిలోనే శ్రీరామ నవమి పండగను నిర్వహించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కట్టుదిట్టంగా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో అయోధ్య వాసులు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇంట్లోనే ఉంటూ రామనవిమిని జరుపుకొంటున్నారు.
బోసిపోయిన ఘాట్లు..
అయోధ్య గుండా ప్రవహించే సరయూ నది బోసి పోయింది. అయోధ్యను సందర్శించడానికి వచ్చే భక్తులు సరయూ నదిలో పుణ్యస్నానాలను ఆచరించడం ఆనవాయితీగా వస్తోంది. వారి సౌకర్యం కోసం నది వద్ద ఘాట్లను నిర్మించింది ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం. లాక్డౌన్ కొనసాగుతున్నందున.. కొత్త వారెవరూ అయోధ్యను దర్శించడానికి రాలేని పరిస్థితి నెలకొంది. స్థానికులు కూడా బయటకి రాలేకపోతున్నారు. సరయూ నది ఘాట్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. కళను కోల్పోయాయి.
నామమాత్రంగా పూజలు నిర్వహించే అవకాశం..
రామజన్మభూమిపై ముసురుకున్న వివాదం పరిష్కారం కావడంతో.. నవమి నాడు రామమందిరం నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. దీనికోసం 15 మందితో రామ మందిరం తీరథ్ ట్రస్ట్ను కూడా ఏర్పాటు చేసింది. కరోనా వైరస్ వల్ల లాక్డౌన్ ప్రకటించడంతో అవన్నీ కార్యరూపాన్ని దాల్చలేకపోయాయి. కొద్దిరోజుల కిందటే రామ్లల్లా విగ్రహాలను రామజన్మభూమిలో పునః ప్రతిష్ఠింపజేయడానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రామ్లల్లా విగ్రహాలను తరలించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
Recommended Video
పరిమిత సంఖ్యలో
ఫలితంగా- ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా రామనవమి ఉత్సవాలను నిర్వహిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ.. అవి ఫలించనట్లే కనిపిస్తోంది. రామ్లల్లా విగ్రహాలకు నామమాత్రంగా పూజలను నిర్వహించడానికి మాత్రమే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. పరిమిత సంఖ్యలో అయోధ్య జిల్లా అధికారులు... రామమందిరం ట్రస్టు ప్రతినిధులు నవమి ఉత్సవాలను నిర్వహిస్తారని చెబుతున్నారు.