యూపీలో తొలి ‘లవ్ జిహాద్’ వ్యతిరేక కేసు నమోదు: బలవంతపు మతమార్పిడిపై తండ్రి ఫిర్యాదు
లక్నో: బలవంతపు మతమార్పిడిని అరికట్టేందుకు ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్ను గవర్నర్ ఆమోదించిన ఒక్క రోజైనా గడవక ముందే రాష్ట్రంలో తొలి కేసు నమోదైంది. ఓ మహిళ మతాన్ని బలవంతంగా మార్చేందుకు ప్రయత్నించాడనే ఆరోపణలతో ఓ యువకుడిపై బరేలి జిల్లా దేవార్నియన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
మతం మార్చుకోవాలని ఓ మహిళపై ఉవైష్ అహ్మద్ అనే వ్యక్తి ఒత్తిడి తేవడంతో అతనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ మహిళ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, నిందితుడు పరారీలో ఉన్నాడని బరేలి పోలీసులు తెలిపారు.
లవ్ జిహాద్ పేరుతో వివాహాల కోసం బలవంతపు మత మార్పిళ్లను ప్రోత్సహించడాన్ని నిషేధిస్తూ ఉత్తరప్రదేశ్ మంత్రివర్గం నవంబర్ 24న అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆర్డినెన్స్కు యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఆమోదం తెలిపారు.
ఈ ఆర్డినెన్స్ ప్రకారం.. బలవంతపు మత మార్పిడికి పాల్పడితే 10 సంవత్సరాల జైలు శిక్షతోపాటు, రూ. 50 వేల జరిమానా విధిస్తారు. ఆ మహిళకు రూ. 5 లక్షల పరిహారం కూడా చెల్లించాల్సి ఉంటుంది.
Recommended Video
వివాహానంతరం మత మార్పిడి జరిపితే జైలు శిక్ష, జరిమానా విధించడంతోపాటు ఆ విహాన్ని కూడా రద్దు చేయడం జరుగుతుంది. అయితే, ఒకవేళ వివాహం తర్వాత ఏ మహిళ అయినా మతం మార్చుకోవాలని భావిస్తే చట్టపరంగా ముందుకు వెళ్లాలి. జిల్లా కలెక్టర్కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. యూపీతోపాటు పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఈ చట్టాన్ని తెచ్చేందుకు కసరత్తులు చేస్తున్నాయి.