యూపీ సీఎం యోగి దెబ్బ: పోలీస్ స్టేషన్ల ముందు క్రిమినల్స్ క్యూ, ఎన్ కౌంటర్ వద్దు!
లక్నో: ఉత్తరప్రదేశ్ పోలీసులకు విచిత్ర పరిస్థితి ఎదురైయ్యింది. యూపీ సీఎం యోగి దెబ్బతో అనేక క్రిమినల్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటు కాలర్ ఎగరేసుకుని తిరిగిన నేరస్తులు స్వయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోతున్నారు. సార్ మేము ఆ నేరం చేశాం, ఈ నేరం చేశాం అంటున్నారు. నేరాలు చేసినట్లు స్వయంగా అంగీకరిస్తున్నారని యూపీ పోలీసులు దబాంగ్ సినిమాలోని డైలాగ్ ట్వీట్ చేశారు.
కాలర్ ఎగరేశారు
ఇప్పటి వరకు కాలర్ ఎగరేసిన చాలా మంది నేరస్థులు ఇలా వచ్చి కాళ్ల మీదపడి లొంగిపోవడంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు సంబరపడిపోతున్నారు. ఈ విషయం స్వయంగా పోలీసులే మీడియాకు చెబుతూ ఓ ట్వీట్ చేశారు. లొంగిపోయిన నేరస్థుల ఫొటోలను ట్విట్టర్లో అప్ లోడ్ చేసి పోలీసులకు కాదు నేరాలకు భయపడుతున్నాం అని సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ సినిమాలోని ఫేమస్ డైలాగ్ పోస్టు పెట్టారు.
Recommended Video
తేల్చి చెప్పిన సీఎం యోగి
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ ఇటీవల అసెంబ్లీలో మాట్లాడుతూ ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,200 ఎన్ కౌంటర్లు జరిగాయని స్వయంగా చెప్పారు. ప్రతిపక్షాలు ఎన్ కౌంటర్లపై చేస్తున్న ఆరోపణలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్రస్థాయిలో స్పంధించారు.
సమాజానికి సిగ్గుచేటు
నేరాలను అదుపులో పెట్టడానికి క్రిమినల్స్ అర్థం చేసుకునే భాషలోనే మేము సమాధానం చెబుతామని సీఎం యోగి అధిత్యనాథ్ చెప్పారు. నేరస్థుల పట్ల సానుభూతి చూపిస్తే ప్రజాస్వామ్యానికి తలనొప్పిగా మారుతారని, సమాజానికే సిగ్గుచేటు అని, మీరెందుకు వారికి మద్దతు ఇస్తారని మండిపడ్డారు.
కాళ్ల మీద పడిన క్రిమినల్స్
సీఎం యోగి ఆధిత్యనాథ్ కు తగ్గట్టే ఉత్తరప్రదేశ్ పోలీసులు క్రిమినల్స్ మీద కఠిన చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు రెచ్చిపోవడంతో ఆందోళన చెందిన నేరస్థులు పోలీస్ స్టేషన్ల ముందు క్యూ కడుతున్నారు. మమ్మల్ని ఎన్ కౌంటర్ చెయ్యరాదని పోలీసుల కాళ్ల మీద పడుతున్నారు.
హాయిగా అరెస్టులు
ఇప్పటి వరకూ తప్పించుకుని తిరుగుతున్న అనేక మంది క్రిమినల్స్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లోని అనేక జైళ్లలో ప్రాణాలతో ఉన్నారు. లొంగిపోకుంటే ఇప్పటికే సాటి క్రిమినల్స్ పట్టిన గతే తమనకుపడుతుందని ఆందోళనతో లొంగిపోవడానికి నేరస్తులు సిద్దం కావడంతో పోలీసులు పోలీస్ స్టేషన్లలో హాయిగా ఉంటూ అరెస్టులు చేసుకుంటున్నారు.