భార్య మృతదేహాన్ని పడేయబోయి.. డ్యాంలో భర్త గల్లంతు, అసలేం జరిగిందంటే..?
చేసిన పాపం ఊరికే పోదంటారు. ఔను.. మూడు ముళ్లు వేసిన ఆ భర్త.. కట్టుకున్న భార్యనే కడతేర్చాడు. హతమార్చడమే కాకుండా డ్యాం మధ్యలో వేద్దామనుకొని వెళ్లాడు. అయితే పడవ బోల్తా పడటంతో.. ఆ భర్త కూడా కనిపించకుండా పోయాడు. అతని ఆచూకీ కోసం పోలీసులు కనుగొనే ప్రయత్నంలో ఉన్నారు. సదరు భర్త ఓ రాజకీయ నేత కూడా కావడం విశేషం.
భార్య హత్య..
యూపీలోని చిత్రకూట్ జిల్లాకు చెందిన భరత్ దివాకర్ (32) స్థానిక ఎస్పీ నేత. అతనికి ఫిష్సింగ్ కాంట్రాక్ట్ బిజినెస్ కూడా ఉన్నాయి. ఏమైందో ఏమో తెలియదు కానీ.. అతను తన భార్యను మట్టుబెట్టాడు. ఈ నెల 14వ తేదీన ఫంక్షన్కు వెళ్లి తిరిగి వస్తోండగా భార్యను హత్యచేశాడు. దివాకర్ ఫిషరీస్లో పనిచేసే రామ్ సేవక్తో కలిసి ఆమె మృతదేహాన్ని కారులో వేసుకొని వస్తున్నారు. రామ్ సేవక్.. భరత్ దివాకర్ డ్రైవర్ కూడా. ఇప్పటివరకు ఓకే.. కానీ తర్వాత అతని పాపం వెంటనే పండింది.
ఫంక్షన్ వెళ్లి వస్తోండగా..
మంగళవారం రోజున (జనవరి 14వ తేదీన) ఫంక్షన్కి వెళ్లి వస్తోన్న సమయంలో.. తన భార్యను దివాకర్ హత్య చేశాడు. తర్వాత రామ్ సేవక్ సాయంతో డిక్కీలో మృతదేహాం పెట్టాడు. దానిని ఎక్కడ పడేయాలని భావించి.. డ్యాంలో పడేద్దామని డిసైడయ్యాడు. అలా వారు మృతదేహాం తీసుకొని చిత్రకూట్ జిల్లాలోని బరువా డ్యాంలోకి వెళ్లారు. అయితే డ్యాం మధ్యలో మహిళా మృతదేహాం పడేసే సమయంలో పడవ కుదుపునకు గురైంది. దీంతో పడవ బోల్తా పడి.. దివాకర్ కూడా గల్లంతయ్యాడు.
రంగంలోకి పోలీసులు
తమ కూతురు కనిపించడం లేదని దివాకర్ అత్త, మామలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ ప్రారంభించిన పోలీసులకు హత్య చేశారని తెలిసి, ఆ దిశగా ఎంక్వైరీ చేశారు. దివాకర్ వద్ద పనిచేసే రామ్ సేవక్ను తమదైన శైలిలో ప్రశ్నిస్తే నిజం అంగీకరించాడు. అమ్మగారిని దివాకర్ హతమార్చాడని.. డ్యాంలో పడేసేందుకు వెళ్లామని చెప్పారు. అయితే పడవ కుదుపునకు గురై బోల్తా పడిందని, తాను తప్పించుకోగలిగానని చెప్పాడు. దివాకర్ మాత్రం మునిగిపోయాడని చెప్పారు. దీంతో పోలీసులు ఎస్డీఆర్ఎఫ్ సాయంతో డ్యాంలో గాలింపు చేపట్టారు. ఎలాగోలా నమిత మృతదేహాన్ని వెలికితీశారు. కానీ భరత్ దివాకర్ ఆచూకీ మాత్రం తెలియరాలేదు.
రామ్ సేవక్ పాత్ర..?
డ్యాం సమీపంలో భరత్ దివాకర్ కారు, నమిత చెప్పులను పోలీసులు గుర్తించారు. భరత్ దివాకర్పై పోలీసులు 302 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. నమిత హత్యలో రామ్ సేవక్ పాత్ర ఉందనే అంశంపై కూడా విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. తమకు దివాకర్ ఆచూకీ తెలిస్తే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని చెప్పారు. నమిత మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించామని, నివేదిక ఆధారంగా హత్య ఎలా జరిగిందనే అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ హత్యల్లో రామ్ సేవక్ పాత్ర ఉంటే అతనిపై కూడా చర్యలు తీసుకుంటామని చిత్రకూట్ ఎస్పీ అంకిత్ మిట్టల్ స్పష్టంచేశారు.