ఇంత ఘోరమా?: పులులకు ఆహారంగా వృద్ధులు
ఉత్తర్ప్రదేశ్లోని పిలిబిత్ టైగర్ రిజర్వ్లో చోటు చేసుకుంటున్న అత్యంత దారుణ ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.
లక్నో: ఉత్తర్ప్రదేశ్లోని పిలిబిత్ టైగర్ రిజర్వ్లో చోటు చేసుకుంటున్న అత్యంత దారుణ ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వం నుంచి వచ్చే పరిహారం కోసం టైగర్ రిజర్వ్ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు పులులకు ఆహారంగా ఏకంగా తమ కుటుంబంలోని వృద్ధులను బలిచేస్తుండటం విచారకరం.
పరిహారం కోసం..
రిజర్వ్లో చనిపోయిన వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం రాదు. దాంతో పులులు చంపి తినేసిన వృద్ధుల మృతదేహాలను తమ పొలాల్లోనే పడేసి అవే దాడి చేసినట్లు చెప్తున్నారు. పరిహారం కోసం ఇలా చేస్తున్నట్లు చెబుతుండటం గమనార్హం.
ఇప్పటికే ఏడుగురు ఇలా..
ఫిబ్రవరి 16 నుంచి ఇప్పటివరకు మలా అటవీ ప్రాంతంలో ఏడుగురు వృద్ధులు పులుల దాడిలో చనిపోయారు. దీంతో ఈ విషయమై డబ్ల్యూసీసీబీ (వైల్డ్లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో) ప్రతినిధి కలీమ్ అథర్విచారణ చేపట్టారు.
చర్యలకు ఆదేశాం
విచారణలో దాడులు ఒక చోట జరుగుతుంటే మృతదేహాలు పొలాల్లో లభ్యమవడంతో అనుమానాలకు తావిచ్చాయి. వెంటనే ఈ నివేదికను కలీమ్ ఎన్టీసీఏ(నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ)కి సమర్పించి వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు.
దిగ్భ్రాంతికి గురిచేస్తున్నా స్థానికుల సమాధానాలు..
ఈ ఘటనలపై స్థానికులను ప్రశ్నించగా.. వారి సమాధానాలు దిగ్భ్రాంతికి గురిచేసేలా ఉన్నాయి. తమ ఇళ్లల్లోని వృద్ధులే పులుల దాడికి బలవ్వాడానికి ఇష్టపూర్వకంగానే ఉన్నట్లు చెబుతున్నారు. ఈ పేదరికంలో జీవించేకంటే పులులకు బలైతే కనీసం వాటి ఆకలైనా తీరుతుందని, కుటుంబానికి పరిహారమైనా లభిస్తుందని ఇలా చేస్తున్నామని అత్యంత దారుణంగా చెబుతుండటం విచారకరం. ఈ వ్యవహారంపై ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని స్థానిక అధికారులు.. ఉన్నతాధికారులు, ప్రభుత్వాన్ని కోరుతున్నారు.