ఉత్తర కర్ణాట ప్రత్యేక రాష్ట్రం డిమాండ్. సీఎం చర్చలతో బంద్ విరమణ, రోజా పూలు!
బెంగళూరు: ఉత్తర కర్ణాటకను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 2వ తేదీ గురువారం 13 జిల్లాల బంద్ కు పిలుపునిచ్చారు. అయితే చివరి నిమిషంలో బంద్ చెయ్యకూడదని నిర్వహకులు నిర్ణయించడంతో ఎప్పటిలాగే ప్రజలు సంచరిస్తున్నారు.
13 జిల్లాల్లో వ్యాపారలావాదేవీలు జరుగుతున్నాయి. బస్సులు సంచరిస్తున్నాయి. కొన్ని విద్యాసంస్థలు మూతపడినా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు వెళ్లారు. బంద్ నిర్వహిస్తే ప్రజలు ఇబ్బందులకు గురి అవుతారని బంద్ ను విరమించుకున్నామని బంద్ నిర్వహకులు తెలిపారు.
ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్రం పోరాట సమితి అధ్యక్షుడు సోమశేఖర్ కూతంబరి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి ఈ ప్రాంతం సమస్యలపై తమతో చర్చించారని అన్నారు. సమస్యలు అన్నీ పరిష్కరిస్తామని, 15 రోజులు సమయం ఇవ్వాలని సీఎం కుమారస్వామి మనవి చేశారని సోమశేఖర్ అన్నారు.
ముఖ్యమంత్రి హామీతో బంద్ నిర్వహించరాదని నిర్ణయించామని సోమశేఖర్ కూతంబరి మీడియాకు చెప్పారు. ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామితో చర్చలు జరిపి బంద్ ను విరమించి అందరినీ మోసం చేసిన సోమశేఖర్ వెంటనే ఈ ప్రాంత ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఉత్తర కర్ణాటక రైతు సంఘం ప్రధాన కార్యదర్శి నాగేష్ డిమాండ్ చేశారు.
కర్ణాటక నవ నిర్మాణ సేన కార్యకర్తలు బెళగావిలో సమైక్య కర్ణాటకకు అందరూ కట్టుబడి ఉండాలని, ప్రత్యేక ఉత్తర కర్ణాటక రాష్ట్రం ఏర్పాటును అందరూ వ్యతిరేకించాలని మనవి చేస్తూ వ్యాపారులు, బస్సులు, లారీలు, ఆటో డ్రైవర్లకు గులాబీ పూలు పంచి పెట్టారు. ఉత్తర కర్ణాటకలో పలు ప్రాంతాల్లో మా డిమాండ్లు తీర్చాలని ధర్నాలు నిర్వహించారు.