మ్యాగీ డేంజర్: ఉత్తరాఖండ్లో నిషేధం, వివాదం ఎలా మొదలైంది..?
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా మ్యాగీ నూడుల్స్ అమ్మకాలపై నిషేదాజ్ఞలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరాఖాండ్ రాష్ట్రం మ్యాగీ నూడుల్స్పై నిషేధం విధించింది. ఇప్పటికే ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్ లలో మ్యాగీ నూడుల్స్పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. బుధవారం సాయంత్రం మ్యాగీ నూడుల్స్ శాంపిల్స్ని పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపిన రాష్ట్ర ప్రభుత్వం, అందులో రసాయనాల మోతాదు ఎక్కువగా ఉండటంతో దానిపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.
ఉత్తరాఖాండ్లోని అన్ని ప్రాంతాల నుంచి మ్యాగీ శాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం పంపినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఓం ప్రకాశ్ తెలిపారు. రాష్ట్రంలోని బిగ్ బజార్లలో మ్యాగీ నూడల్స్ అమ్మకాలను నిలిపివేశారని, చిన్న చిన్న షాపుల్లో నిలిపివేయడానికి మరికొంత సమయం పడుతుందన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో 13 మ్యాగీ నూడుల్స్ నమూనాలను పరీక్షించగా 10 నమూనాల్లో సీసం మోతాదు ఎక్కువగా ఉన్నట్లు తేలిందని ఢిల్లీ సర్కారు తెలిపింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం మ్యాగీ నూడుల్స్పై 15 రోజుల పాటు నిషేధం విధిస్తూ బుధవారం అదేశాలు జారీ చేసింది.
దీంతో ప్రముఖ సూపర్ మాల్స్ అయిన బిగ్ బజార్, కేంద్రీయ భండార్లు దేశవ్యాప్తంగా గల తమ దుకాణాల్లో వీటి విక్రయాలను నిలిపివేశాయి. ఇక మ్యాగీ నూడుల్స్ ప్రచార ప్రకటనల్లో పాల్గొన్న సినీనటులు అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, ప్రీతిజింటాలపై కేసులు నమోదు చేయాలని బీహార్ కోర్టు మంగళవారం ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమబెంగాల్, అస్సాం, మేఘాలయ, జార్ఖండ్, ఒడిశా, గుజరాత్, హర్యానా తదితర రాష్ట్రాలు కూడా మ్యాగీ నూడుల్స్ శాంపిల్స్ను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్లకు పంపించారు.
అసలు మ్యాగీ నూడుల్స్ వివాదం ఎలా మొదలైంది?
భారతదేశంలో ఎంతో ప్రాచుర్యం పొందిన మ్యాగీ నూడుల్స్ ఇది. అంతర్జాతీయ కంపెనీ నెస్లే 1947 నుంచే అందిస్తున్న బ్రాండ్. ఈ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా పిల్లలతో పాటు పెద్దలనూ బాగా ఆకట్టుకుంది. ఉత్తరప్రదేశ్లో విక్రయిస్తున్న మ్యాగీ నూడుల్స్లో సీసం(లెడ్), మోనోసోడియం గ్లుటామేట్లు అనుమతించిన మోతాదు కంటే చాలా ఎక్కువగా ఉన్నట్లు మే నెలలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు గుర్తించడంతో ఈ వివాదం మొదలైంది.