బీజేపీ షాకింగ్ నిర్ణయం.. ఏకంగా అంతమందిని ఒకేసారి.. పార్టీ నుంచి ఔట్..!
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ బీజేపీ పెద్దలు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 90 మందిని పార్టీ నుంచి బహిష్కరించారు. అంతమందికి ఒకేసారి ఉద్వాసన పలకడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఎన్నడూ లేని విధంగా బీజేపీ నేతలు తీసుకున్న ఇలాంటి నిర్ణయం కాషాయం దండును కలవర పెడుతోంది.
ఉత్తరాఖండ్ బీజేపీ పెద్దలు పార్టీకి చెందిన 90 మందిని ఏకకాలంలో టార్గెట్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని 90 మందికి ఒకేసారి ఉద్వాసన పలికారు. ఆ మేరకు వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. జిల్లా స్థాయిలో నియమించిన పార్టీ అంతర్గత కమిటీలు ఇచ్చిన రిపోర్టుల ప్రకారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ భట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వారిపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే కమిటీలు వేయడం గమనార్హం.
టీఆర్ఎస్ ప్రభుత్వానికి గిన్నిస్ ఖాయం.. రేవంత్ రెడ్డి జోస్యం..! ఎందుకంటే..!!
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరగబోతున్న పంచాయతీ ఎన్నికలు 90 మంది బీజేపీ నేతల సస్పెన్షన్కు కారణమయ్యాయి. పన్నెండు జిల్లాల్లో ఈ నెల ఆరో తేదీ నుంచి పది రోజుల పాటు మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే బీజేపీ సపోర్టుతో బరిలో నిలిచిన అభ్యర్థులకు అండగా నిలబడాల్సింది పోయి వారిని వ్యతిరేకిస్తూ కొందరు నామినేషన్లు దాఖలు చేశారు. దాంతో బీజేపీ అధిష్టానం ఆగ్రహానికి గురైంది. అయితే వారికి ఓ ఛాన్స్ ఇచ్చే విధంగా నామినేషన్లు ఉపసంహరించుకోవాలని కోరింది. లేదంటే ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించింది. అయినా కూడా వారిలో మార్పు కనిపించకపోవడంతో క్రమశిక్షణ ఉల్లంఘన కింద వారికి ఉద్వాసన పలికినట్లు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రాజేశ్ భండారీ వెల్లడించారు.