కరోనా కాటు: బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ కన్నుమూత
డెహ్రాడూన్: దేశంలో కరోనా ఉధృతి కొంతమేర తగ్గినప్పటికీ పూర్తిగా అయితే, పోలేదు. ప్రతి రోజు దేశ వ్యాప్తంగా 40-50వేల కరోనా పాజిటివ్ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. సుమారు 400 వరకు మరణాలు కూడా సంభవిస్తున్నాయి. కరోనా బారినపడి చనిపోతున్నవారిలో ప్రముఖులు కూడా ఉంటున్నాడు.
తాజాగా, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అల్మోరా జిల్లా సాల్ట్ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ జీనా(50) కరోనాబారినపడి మరణించారు. కరోనా పాజిటివ్ అని తేలవడంతో ఆయన గత కొద్ది రోజులుగా న్యూఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు.
వారం రోజుల క్రితం దేశ రాజధానిలోని సర్ గంగారాం ఆస్పత్రిలో జీనా కరోనా చికిత్స కోసం చేరారు. ఆనాటి నుంచి చికిత్స పొందుతున్న ఆయన గురువారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో కన్నుమూశారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దేవేంద్ర భాసిన్ తెలిపారు.
ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ జీనా మరణం పట్ల బీజేపీ ఉత్తరాఖండ్ అధ్యక్షుడు బన్సిధర్ భగత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని అన్నారు. ఓ మంచి నేతను కోల్పోవడం సమాచానికి కూడా లోటేనని చెప్పారు. జీనా యంగ్ ఎనర్జిటిక్ లీటర్ అని, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవారని తెలిపారు.
జీనా మృతి పార్టీతోపాటు సమాజానికి కూడా తీరని లోంటని భగత్ చెప్పారు. అనారోగ్య కారణాలతో జీనా భార్య కూడా ఇటీవలే మరణించారు. జీనా కుటుంబానికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భగత్ వెల్లడించారు. ఇప్పటికే కరోనా బారినపడి పలువురు కేంద్రమంత్రులతోపాటు రాష్ట్రమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మృతి చెందారు.
కాగా, ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు తక్కువ మొత్తంలోనే నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,05,224 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,00,302 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా బారినపడి 913 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,009 యాక్టివ్ కేసులున్నాయి.