కరోనా బారినపడిన మరో ముఖ్యమంత్రి: తనను కలిసినవారంతా టెస్టులు చేసుకోవాలని వినతి
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ కరోనావైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఆయనే వెల్లడించారు. తనకు కరోనా సోకిందని.. ఇటీవల తనను కలిసినవారంతా సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండాలని ముఖ్యమంత్రి కోరారు.
'ఈ రోజు నేను కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకున్నాను. దానిలో కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం నాకు ఎలాంటి లక్షణాలు లేవు. నా ఆరోగ్యం బాగానే ఉంది. వైద్యుల సూచన మేరకు ఐసోలేషన్లో ఉంటాను. గత కొన్ని రోజులుగా నాతో సన్నిహితంగా మెలిగిన వారందరూ ఐసోలేషన్లో ఉండటంతోపాటు కరోనా టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తున్నా' అని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కొత్తగా నమోదైన 620 పాజిటివ్ కేసులతో కలిపి గురువారం నాటికి మొత్తం కేసుల సంఖ్య 84,689కి చేరుకున్నాయి. తాజాగా, 9 మరణాలతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1384కు చేరింది. ఇప్పటి వరకు 76,223 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
ఇక దేశ వ్యాప్తంగా కరోనావైరస్ కేసుల సంఖ్య 99 లక్షల 70వేలకు చేరుకుంది. వీరిలో ఇప్పటికే 95 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో లక్షా 44వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా ప్రతి రోజు 30 వేలకు లోపుగానే కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 3 లక్షల యాక్టివ్ కేసులున్నాయి.