6 నెలల పసిపాప, 2 చిన్నారి సహా 49 మందిపై కేసు: క్వారంటైన్ రూల్స్ బ్రేక్ చేయడంతో చర్యలు..
ఉత్తరాఖండ్లో వింత ఘటన జరిగింది. ఆరునెలల వయస్సున్న పసిపాప, రెండేళ్ల చిన్నారిపై కేసు నమోదు చేశారు. వినడానికి వింతగా ఉన్నా పోలీసులు మాత్రం ధైర్యమే చేశారు. వాస్తవానికి 8 ఏళ్ల లోపు వయస్సున వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉండదు. జువైనల్ యాక్ట్ కింద వారిపై అభియోగం మోపకూడదు.. కానీ ఇద్దరినీ విచారిస్తామని పోలీసులు చెబుతున్నారు.
కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఉత్తరాఖండ్ ఉత్తరకాశీ జిల్లాలో హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారు. వైరస్ వ్యాప్తి చెందుతున్న క్రమంలో బయటకు వచ్చేందుకు అనుమతి లేదు. కష్టమో నష్టమో ఇంట్లోనే ఉండాలి. బుద్ది తెలిసినవారికి చెబితే వింటారు. కానీ చిన్నారులకు ఏం తెలుసు... మెల్లగా బయటకొచ్చారు. దీనిని అక్కడే నక్కి ఉన్న పోలీసులు చూశారు. అయితే వీరు పెద్దలతో కలిసి రావడం విశేషం.
వాస్తవానికి క్వారంటైన్లో ఉన్న మిగతావారు కూడా రూల్స్ బ్రేక్ చేశారు. 49 మందితో ఇద్దరు చిన్నారులు కూడా వచ్చారు. దీంతో పోలీసులు వారందరీపై కేసులు నమోదు చేశారు. 49 మందిపై కేసు నమోదు చేశామని.. చిన్నారులపై దర్యాప్తు చేస్తామని ఉత్తర కాశీ డీఎం తెలిపారు. కరోనా వైరస్ వ్యాపిస్తోన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. అత్యవసర సేవలు తప్ప.. సాధారణ సేవలను రద్దు చేశారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావొద్దని అధికారులు మొత్తుకుంటున్నారు. అయినా కొందరు వినకపోవడంతో కఠిన చర్యలు తీసుకునేందుకు వెనకాడటం లేదు.
Recommended Video