ఉత్తరాఖండ్: నెగ్గిన హరీష్ రావత్, అరుదైన ఘటన
ఢిల్లీ: ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో మంగళవారం నాడు హరీష్ రావత్ విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీలో మంగళవారం జరిగిన విశ్వాస పరీక్షలో హరీష్ రావత్ నెగ్గారు. హరీష్ రావత్ ప్రభుత్వానికి మాయావతికి చెందిన బీఎస్పీ మద్దతు పలికింది.
కాంగ్రెస్ పార్టీకి 34 ఓట్లు అనుకూలంగా వచ్చాయి. బీజేపీకి అనుకూలంగా 28 మంది సభ్యులు నిలిచారు. ఫలితాలను సీల్డ్ కవర్లో బుధవారం సుప్రీం కోర్టుకు అందించనున్నారు. రేపు సుప్రీం కోర్టు బలపరీక్ష ఫలితాలను వెల్లడించనుంది. సీఎస్ పర్యవేక్షణలో బలపరీక్ష జరిగింది. సభకు 62 మంది సభ్యులు హాజరయ్యారు.
మాయావతి తొలుత బీజేపీకి అండగా ఉంటానని చెప్పారు. అయితే, చివరి నిమిషంలో ఆమె హరీష్ రావత్కు మద్దతు పలికారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి 34 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యురాలు రేఖా అర్యా చివరి నిమిషంలో బీజేపీ వైపు మొగ్గు చూపారు. బీజేపీ నుంచి ఒకరు కాంగ్రెస్కు ఓటేశారని తెలుస్తోంది. దీంతో 70 మంది ఎమ్మెల్యేలున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ప్రస్తుతం 62 మందితో బలపరీక్ష జరిగింది.
రెండు గంటలపాటు రాష్ట్రపతి పాలన ఎత్తివేత
ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలనను ఎత్తివేశారు. సోమవారం ఉదయం కేంద్రం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఎత్తివేత ఉత్వర్వులు కేవలం రెండు గంటల వ్యవధి మాత్రమే అమల్లో ఉంటాయి. దేశ రాజకీయ చరిత్రలోనే అరుదైన ఘటనగా రాజ్యంగ నిపుణులు పేర్కొంటున్నారు.
ఈ వ్యవహారంలో కేవలం రెండు గంటల సేపు మాత్రమే రాష్ట్రపతి పాలనను ఎత్తివేశారు. సంపూర్ణ మెజారిటీలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సీఎం హరీశ్ రావత్కు తొమ్మిది మంది సొంత పార్టీ ఎమ్మెల్యేలు చేయివ్వగా ఆయన ప్రభుత్వం మైనారిటీలో పడిన విషయం తెలిసిందే.
పలు నాటకీయ పరిణామాల్లో భాగంగా ఉత్తరాఖండ్ అసెంబ్లీని సుప్తచేతనావస్థలో పెట్టిన కేంద్రం ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సిఫారసు చేసింది. కేంద్ర ప్రతిపాదనకు రాష్ట్రపతి కూడా ఆమోద ముద్ర వేయడంతో ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది.
అయితే ఉత్తరాఖండ్ హైకోర్టు, సుప్రీం కోర్టులు పార్టీ ఫిరాయింపులపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకునేందుకు హరీష్ రావత్కు అవకాశం వచ్చింది. ఈ నేపథ్యంలో బల పరీక్ష నిర్వహించాలంటే అసెంబ్లీని సుప్త చేతనావస్థలో నుంచి తప్పించాలి.
ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు దిశానిర్దేశంతో ఆ రాష్ట్రంలో బల పరీక్ష జరిగే సమయంలో రాష్ట్రపతి పాలనను ఎత్తివేసేందుకు కేంద్రం అంగీకరించింది. మంగళవారం ఉదయం రావత్ అసెంబ్లీకి చేరుకోగా, రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.