ఉత్తరాఖండ్ లో బీజేపీ పాగా : ఎగ్జిట్ పోల్స్ లో న్యూస్ 24, చాణక్య సర్వే అంచనా
ఉత్తరాఖండ్ లో బీజేపీ పాగా వేయనున్నట్లు న్యూస్ 24, చాణక్య సర్వే స్పష్టం చేస్తుండగా, సీఓటర్ మాత్రం పూర్తి భిన్నమైన ఫలితాలను అంచనా వేస్తోంది.
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. ఒక్క పంజాబ్ తప్ప మిగిలిన నాలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ హవా స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ ఎగ్జిట్పోల్ ఫలితాలు చూస్తే నోట్ల రద్దు.. బీజేపీపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపనట్లు తెలుస్తున్నది.
ఉత్తరాఖండ్ లో బీజేపీ పాగా వేయనున్నట్లు ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. గురువారం సాయంత్రం ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో ప్రస్తుతమున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టి బీజేపీ గెలిచే అవకాశముందని తేలింది.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో పలు జాతీయ ఛానెళ్లు బీజేపీ గెలుపునకే మొగ్గు చూపగా. కాంగ్రెస్ ను రెండో స్థానానికి పరిమితం చేశాయి. న్యూస్ 24, చాణక్య సర్వే ప్రకారం 70 స్థానాలు ఉన్న ఈ రాష్ట్రంలో బీజేపీకి 53, కాంగ్రెస్ కు 15, ఇతరులకు 2 సీట్లు రానున్నాయి.
అయితే ఇండియాటుడే-సీఓటర్ మాత్రం పూర్తి భిన్నమైన ఫలితాలను అంచనా వేస్తోంది. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ లకు చెరో 32 సీట్లు వస్తాయని సీ ఓటర్ సర్వే తేల్చింది. ఇక న్యూస్ ఎక్స్ సర్వేలో బీజేపీకి 38 సీట్లు, కాంగ్రెస్ కు 30 సీట్లు, ఇతరులకు 2 సీట్లు వస్తాయని అంచనా.