దేవప్రయాగ, హృషికేష్, హరిద్వార్లల్లో భయంభయం: గంగోత్రి, బద్రినాథ్ హైవే క్లోజ్: మృతదేహాల కుప్ప
డెహ్రాడూన్: దేవభూమి ఉత్తరాఖండ్.. మరోమారు మరుభూమిగా మారుతోంది. చమోలీ జిల్లాలో చోటు చేసుకున్న ఫ్లాష్ ఫ్లడ్స్ కారణంగా ధౌలిగంగా అత్యంత ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. వరద నీటితో పోటెత్తుతోంది. అనూహ్యంగా సంభవించిన ఈ ఘటన.. 150 మందిని పొట్టనపెట్టుకుని ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. భయాందోళనలు, విషాదకర ఛాయలు నెలకొన్నాయి. వరద ప్రవాహానికి కొట్టుకుని పోయిన వారి మృతదేహాలు బయటపడుతున్నాయి. ఇప్పటిదాకా ఎనిమిదికి పైగా మృతదేహాలను గుర్తించినట్లు తెలుస్తోంది.
ఆనకట్ట తెగడంతో..
ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలోని తపోవన్ ప్రాంతం గుండా ప్రవహిస్తోన్న ధౌలిగంగా నదికి అకస్మాత్తుగా వరద ప్రవాహం పెరగడం వల్ల దాని మీద నిర్మిస్తోన్న ఆనకట్ట తెగిపోయింది. 24 మెగావాట్ల ఉత్పాదక సామర్థ్యంతో తపోవన్ జల విద్యుత్ కేంద్రం నిర్మాణ పనుల్లో నిమగ్నమైన ఉన్న కార్మికులందరూ ఈ ఘటనలో గల్లంతయ్యారు. ఆనకట్ట తెగడం వల్ల దిగువకు ప్రవహించిన ధౌలిగంగ జలాలు రైనీ గ్రామాన్ని ముంచెత్తాయి. వరద నీటి ప్రవాహానికి పలు నివాసాలు కొట్టుకెళ్లాయి. పదుల సంఖ్యలో స్థానికులు గల్లంతు అయ్యారు.
దేవప్రయాగ, హృషికేష్, హరిద్వార్ల్లో
ధౌలిగంగకు పోటెత్తిన వరద ప్రవాహం ప్రభావం.. దిగువ ప్రాంతాలపై పడింది. అలకనంద, గంగనాది నీటి మట్టం క్రమంగా పెరిగింది. ఫలితంగా- దేవప్రయాగ, హృషికేష్, హరిద్వార్ల్లో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని స్థానిక అధికారులు తీర ప్రాంతాలను ఖాళీ చేయించారు. పవిత్ర స్నానాలను ఆచరించడానికి వచ్చిన భక్తులను వెనక్కి పంపించేశారు. ధౌలిగంగ తీరం పొడవునా మైకుల ద్వారా అనౌన్స్మెంట్లను వినిపించారు. నీల్ధారా, చండీఘాట్ను ఖాళీ చేయించారు.
బద్రీనాథ్, గంగోత్రి హైవే క్లోజ్..
దేవప్రయాగ, హృషికేష్, హరిద్వార్ నదీ తీరాల్లో చిరు వ్యాపారులను అక్కడి నుంచి పంపించి వేశారు. ఘాట్లను ఖాళీ చేయించారు. హృషికేష్-బద్రీనాథ్ జాతీయ రహదారిని మూసివేశారు. ధౌలిగంగ నదీ తీరం వెంట ఈ జాతీయ రహదారి కొనసాగుతున్నందున.. తక్షణ చర్యలను తీసుకున్నారు. వాహనాల రాకపోకలను నిలిపివేశారు. గంగోత్రి హైవేని క్లోజ్ చేశారు. భద్రకాళి చెక్ పోస్ట్ మీదుగా తపోవన్ వైపు వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. తపోవన్, కైలాష్ గేట్ వద్ద పోలీసులను మోహరింపజేశారు.
కొండచరియలు విరిగి పడటంతో..
చమోలీ జిల్లాలో విస్తరించిన నందా దేవి జాతీయ పార్క్లో కొండ చరియలు విరిగి పడటం వల్ల ధౌలిగంగా నదికి ఒక్కసారిగా ప్రవాహం పెరిగింది. ఈ ప్రవాహ ఉధృతిని, నదీ జలాల తాకిడికి తపోవన్ హైడల్ ప్రాజెక్ట్, ఆనకట్ట నిలువలేకపోయాయి. అట్టముక్కలా తెగిపోయాయి. ఈ సమాచారం అందుకున్న వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. పెద్దఎత్తున సహాయక చర్యలను చేపట్టాయి. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నాయి. దీనికోసం వైమానిక దళం నుంచి హెలికాప్టర్లను రప్పించారు.
ఎన్టీపీసీ వద్ద మూడు మృతదేహాలు..
కాగా- నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ సమీపంలో మూడు మృతదేహాలను సహాయక సిబ్బంది గుర్తించారు. అదే ప్రాంతంలో మరో అయిదింటిని గుర్తించినట్లు తెలుస్తోంది. తపోవన్ సమీపంలో ఉందీ ఎన్టీపీసీ. మట్టి కుప్పగా మారిన రైనీ గ్రామం నుంచి దిగువన ఉన్న హరిద్వార్ వరకూ గాలింపు చర్యలను చేపట్టారు. ఎన్టీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్, ఐటీబీపీ, రాష్ట్ర పోలీసులు సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొంటున్నాయి. అవసరమైతే అదనపు బలగాలను రప్పించడానికి ఏర్పాట్లు చేశారు.