కనీవినీ ఎరుగని కల్లోలం: పూచిక పుల్లల్లా: రంగంలో వాయుసేన: మోడీ ఆరా..నిర్మలమ్మ షాక్
డెహ్రాడున్: ఉత్తరాఖండ్లో తాజాగా సంభవించిన పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్తో ఫోన్లో మాట్లాడారు. పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రాణనష్టాన్ని నివారించడానికి, తగ్గించడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలని సూచించారు. సహాయక చర్యల్లో వైమానిక దళాన్ని దింపారు. డెహ్రాడూన్, పరిసర ప్రాంతాల్లోని వైమానిక దళ కేంద్రాల నుంచి హెలికాప్టర్లను సంఘటనా స్థలానికి తరలించారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.
Praying for safety of All. Mahadev Bless #Uttarakhand #Chamoli pic.twitter.com/WbI4BcaL6n
— Bharat Temples (@BharatTemples_) February 7, 2021
ఐటీబీపీ, వైమానిక దళాలు..
ఇండో-టిబెట్ బెటాలియన్ పోలీసులు, జాతీయ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ, బలగాలు, ఎస్డీఆర్ఎఫ్ సహాయక చర్యల్లో నిమగ్నం అయ్యాయి. ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలోని నందాదేవి జాతీయ పార్క్ పరిధిలో అనూహ్యంగా కొండ చరియలు, మంచు చరియలు విరుచుకుపడటంతో ధౌలిగంగా నదికి ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగింది. నదీ జలాలు పోటెత్తాయి. అప్పటికే ఉధృతంగా ప్రవహిస్తోన్న ధౌలిగంగ.. కొండచరియలు విరిగిపడటంతో మరింత ఉగ్రరూపాన్ని ధరించింది.
పూచిక పుల్లల్లా..
వరద ప్రవాహానికి. 24 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన జల విద్యుత్ను ఉత్పత్తి చేయడానికి ధౌలి గంగ నదిపై తపోవన్ ప్రాంతంలో నిర్మిస్తోన్న ఆనకట్ట తెగిపోయింది. దీనితో నది దిగువకు ఉరకలెత్తింది. దిగవనే ఉన్న రెని గ్రామాన్ని ముంచెత్తింది. ఈ ఘటనలో 150 నుంచి 300 మంది వరకు గల్లంతై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. తపోవన్ హైడల్ ప్రాజెక్ట్ నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉన్న కార్మికులు కొట్టుకెళ్లిపోయారు. వారి కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలను చేపట్టారు.
హుటాహుటిన అధికార యంత్రాంగం
సమాచారం అందుకున్న వెంటనే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్తో ఫోన్లో మాట్లాడారు. అస్సాం పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఘటనపై ఆరా తీశారు. వందలమంది గల్లంతు కావడంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. త్రివేంద్ర సింగ్ రావత్కు ఫోన్ చేశారు. ప్రాణనష్టాన్ని తగ్గించేలా తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. సహాయక చర్యల కోసం వైమానిక దళం హెలికాప్టర్లను రంగంలోకి దించింది.
హెల్ప్లైన్ నంబర్లు..
డెహ్రాడూన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి ఎంఐ-17, ఎల్ఎల్హెచ్ ధృవ్ చాపర్లను సంఘటనా స్థలానికి తరలించింది. ఐటీబీపీ జవాన్లు సంఘటనా స్థలంలో సహాయక చర్యలను చేపట్టారు. ఫ్లాష్ ఫ్లడ్ వల్ల ధౌలిగంగపై నిర్మించిన పలు వంతెనలు ధ్వంసం అయ్యాయి. అత్యంత ప్రమాదకరంగా మారాయి. జోషిమఠ్-మలరి బ్రిడ్జ్ కొట్టుకుని పోయింది. పలు వంతెనల పరిస్థితి దారుణంగా మారింది. వాటిపై రాకపోకలు సాగించవద్దంటూ స్థానిక అధికారులు హెచ్చరికలను జారీ చేశారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రౌండ్ ద క్లాక్ తరహాలో హెల్ప్లైన్ కేంద్రాన్ని నెలకొల్పారు. బాధితులు 1070 లేదా 9557444486 ఫోన్ చేయాలని సూచించారు.