ఉత్తరాఖండ్ జల విలయం: 26కు చేరిన మృతుల సంఖ్య, 171 మంది కోసం అర్ధరాత్రి గాలింపు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఛమోలి జిల్లాలో సంభవించిన వరదల కారణంగా మరణించినవారి సంఖ్య పెరుగుతోంది. సోమవారం రాత్రి వరకు 26 మృతదేహాలను వెలికితీసినట్లు ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు. మరో 171 మంది ఆచూకీ తెలియరాలేదన్నారు.
26 మంది మృతదేహాలు లభ్యం.. 171 మంది మిస్సింగ్
'ఫిబ్రవరి 8 రాత్రి 8 గంటల వరకు 26 మృతదేహాలను వెలికి తీశారు. 171 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. అందులో 35 మంది టన్నెల్లో ఉండే అవకాశం ఉంది. రాత్రి కూడా ఇక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి' అని ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
టన్నెల్లో మరో 30-35 మంది..
తపోవన్లోని 250 మీటర్ల టన్నెల్లో సుమారు 30 మంది కార్మికులు చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. వీరిని కాపాడేందుకు సహాయక బృందాలు సోమవారం రాత్రి తర్వాత కూడా సహాయక కార్యక్రమాలను కొనసాగిస్తున్నాయి. జోషి మఠ్ ప్రాంతంలో ఆర్మీతోపాటు ఐటీబీపీ, ఎన్డీఆర్ఎప్, ఎస్డీఆర్ఎఫ్ సంయుక్తంగా సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. తపోవన్-విష్ణుగడ్ ప్రాజెక్టు టన్నెల్లో సుమారు 35 మంది వరకు చిక్కుకుని ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
27 మందిని కాపాడిన సహాయక బృందాలు
కాగా, ఇప్పటి వరకు ఈ వరద ప్రమాదంలో 27 మందిని సురక్షితంగా కాపాడాయి సహాయక బృందాలు. తపోవన్-విష్ణుగడ్ ప్రాజెక్టు స్థలంలోని ఓ టన్నెల్ నుంచి 12 మందిని, రిషిగంగా ప్రాంతంలోని మరో టన్నెల్లో 15 మందిని సహాయక బృందాలు కాపాడాయి.
భయానక అనుభవం: టన్నెల్ నుంచి ప్రాణాలతో బయటపడ్డ కార్మికుడు
టన్నెల్ నుంచి ప్రాణాలతో బయటపడిన కొందరు కార్మికులు మాట్లాడారు. తాము టన్నెల్లో పనిచేస్తుండగానే ఒక్కసారిగా భారీగా వరదనీరు చేరుకుందని చెప్పారు. దీంతో తామంతా అక్కడే చిక్కుకుపోయామన్నారు. టన్నెల్లో 300 మీటర్ల లోపల తామున్నామని, నీరు చేరుకోవడంతో టన్నెల్ పై భాగంలోని ఇనుప కడ్డీలను పట్టుకుని వెళ్లాడమని చెప్పారు. తమ ముఖం నీటిపైభాగం ఉండేలా చూసుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డామని తెలిపారు. సమారు గంటపాటు అలా ఉన్న తర్వాత క్రమంగా నీరు తగ్గుకుంటూ వచ్చిందని, ఆ తర్వాత సహాయక బృందాలు వచ్చి తమను కాపాడాయని వెల్లడించారు. అదో భయానక అనుభవమని వారు చెప్పారు.
జలవిలయంతో నష్టం భారీగానే..
కాగా, ధౌలిగంగా, అలకనంద నదుల వరదల కారణంగా పరివాహక గ్రామాలు కూడా భారీగా దెబ్బతిన్నాయి. నదులపై ఉన్న రెండు డ్యాంలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఐదు వంతెనలు కూడా కొట్టుకుపోయాయి. అనేక గ్రామాలు దెబ్బతిన్నాయి. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. దీంతో వందల సంఖ్యలు ప్రజలు నిరాశ్రయులయ్యారు. దీంతో వారికి నిత్యావసర సరుకులను అందిస్తున్నాయి సహాయక బృందాలు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. అవసరమైన సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తున్నారు. ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ ఇప్పటికే రూ. 20 కోట్ల నిధులను సహాయక కార్యక్రమాలు, బాధిత ప్రజల కోసం వినియోగించేందుకు విడుదల చేశారు.