జల ప్రళయం: 150 మంది గల్లంతు, రంగంలోకి ఆర్మీ, ఐఏఎఫ్, ఐటీబీపీ, హెలికాప్టర్లు, విమానాలు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో ధౌలీగంగా నదిని ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో సుమారు 150 మంది గల్లంతయ్యారు. పర్వతప్రాంతాల్లోని మంచుచరియలు విరిగపడటంతో ఒక్కసారిగా నీటి మట్టం పెరిగింది. రైనీ తపోవన్ గ్రామం వద్ద ఉన్న పవర్ ప్రాజెక్టులోకి భారీగా వదరనీరు ఒక్కసారిగా పోటెత్తింది.
కొట్టుకుపోయిన రెండు డ్యాంలు.. 150 మంది గల్లంతు
ఈ క్రమంలో రైనీ వద్ద ఉన్న ఆనకట్ట(డ్యాం) కొట్టుకుపోయింది. వరదనీరుతో రుషిగంగా పవర్ ప్రాజెక్టు కూడా భారీగా దెబ్బతింది. ఈ విద్యుత్ కేంద్రంలో మరమ్మతుల కోసం పనిచేస్తున్న 150 మంది కార్మికులు వరదల్లో కొట్టుకుపోయారు. నదీ పరివాహక గ్రామాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. నదీకి సమీపంలోని ప్రజలను సురక్షితంగా ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించారు.
10 మృతదేహాల వెలికితీత
వరదలపై కేంద్రం కూడా వెంటనే అప్రమత్తమై కేంద్ర సహాయక బృందాలను పంపింది. ఆర్మీకి చెందిన బలగాలు కూడా సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. సుమారు 600 మందికిపైగా ఐఏఎఫ్, ఆర్మీ, ఐటీబీపీ, మార్షల్స్, ఇతర బలగాలు కూడా రంగంలోకి దిగి సహయాక చర్యల్లో ముమ్మరంగా పాల్గొంటున్నాయి. 10 మంది కార్మికుల మృతదేహాలను వెలికితీసినట్లు సమాచారం.
రంగంలోకి ఆర్మీ, ఎయిఫోర్స్ హెలికాప్టర్లు, విమానాలు
హెలికాప్టర్లతో నదిలో గల్లంతైనవారి కోసం ఆర్మీ దళాలు గాలిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర బలగాలు, అధికారులు సంయుక్తంగా సహాయక చర్యలను చేపడుతున్నారు. మూడు హెలికాప్టర్లు, రెండు ఎంఐ-17ఎస్ విమానాలు, ఏఎల్హెచ్ ధృవ్ చాపర్ లతో భారత వాయుసేన.. డెహ్రాడూన్, పరిసర ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసింది.
అవసరమైతే మరికొన్ని విమానాలను కూడా రంగంలోకి దించుతామని వాయుసేన అధికారులు చెప్పారు. తపోవన్, రెనీ ప్రాంతాల్లో ఇండో-టిబెటన్ బోర్డర్ పట్రోల్(ఐటీబీపీ) బలగాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. స్థానిక అధికారులకు మద్దతుగా 200 మంది జవాన్లు సహాయక చర్యలను చేపట్టాయి. నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు చెబుతున్నారు.
వేలాది మందిని తరలించిన ఎన్డీఆర్ఎఫ్
నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్డీఆర్ఎఫ్)కు చెందిన మూడు బృందాలు ఇప్పటికే సహాయక చర్యలు ప్రారంభించాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఢిల్లీ నుంచి మరిన్ని బృందాలు అక్కడికి చేరుకునేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఉత్తరాఖండ్ సర్కారుకు అన్ని విధాలుగా సహకారాలు అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని వేలాది కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ ప్రధాన్ తెలిపారు. ఆకస్మిక వరదల కారణంగా రెండు ప్రాజెక్టులకు భారీగా నష్టం జరిగిందని చెప్పారు.