ప్రతికూల వాతావరణం ఏమీ లేదు: ఉత్తరాఖండ్ వరద ప్రాంతాలపై ఐఎండీ
న్యూఢిల్లీ/డెహ్రాడూన్: ఫిబ్రవరి 7, 8 తేదీల్లో ఉత్తరాఖండ్లోని చమోలి, తపోవన్, జోషిమత్లపై ఎటువంటి ప్రతికూల వాతావరణ సంఘటనలు జరిగే అవకాశం లేదని.. వరద ఘటన జరిగిన ప్రాంతానికి ఉపశమనం కలిగిస్తూ భారత వాతావరణ విభాగం ఆదివారం తెలిపింది.
భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆనంద్ శర్మ మాట్లాడుతూ.. వరద ప్రభావిత ప్రాంతాలైన ఛమోలి, తపోవన్, జోషిమఠ్ లలో ఆదివారం, సోమవారం పొడి వాతావరణమే ఉంటుందన్నారు. ఎలాంటి మంచు వర్షం కూడా కురిసే అవకాశం లేదన్నారు.
అయితే, ఫిబ్రవరి 9-10 మధ్య కాలంలో ఛమోలీ జిల్లాలోని ఉత్తర ప్రాంతాల్లో తేలికపాటి మంచు వర్షం కురిసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. కాగా, తపోవన్-రేని పవర్ ప్రాజెక్టు వద్ద 150 మంది కార్మికులు పనిచేస్తుండగా.. ఒక్కసారిగా భారీ వరద రావడంతో వారంతా గల్లంతయ్యారు.
ధౌలీ గంగా నదికి భారీ వరదలు రావడంతో పరివాహక గ్రామాలు కూడా భారీగా నష్టపోయాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లోని వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి సహాయక బృందాలు. ఇప్పటి వరకు ఏడుగురి మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. మరో 16 మందిని సహాయక బృందాలు కాపాడాయి.