సీఎం అవినీతిపై సీబీఐ విచారణ... హైకోర్టు సంచలన ఆదేశాలు... షాక్లో బీజేపీ నేతలు...
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్పై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఆ రాష్ట్ర హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపై హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి రావత్పై అవినీతి ఆరోపణలు చేస్తూ ఉమేశ్ కుమార్ శర్మ అనే జర్నలిస్ట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ముఖ్యమంత్రిపై సీబీఐ విచారణకు ఆదేశాలిచ్చింది.
జర్నలిస్టు పిటిషన్లో ఏముంది...
ఉమేశ్ కుమార్ శర్మ,శివప్రసాద్ శర్మ అనే ఇద్దరు జర్నలిస్టులు తమపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను కొట్టివేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ న్యాయస్థానంలో రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. ముఖ్యమంత్రి అవినీతిని బయటపెట్టినందుకే డెహ్రాడూన్ పరిధిలోని నెహ్రూ కాలనీ పోలీస్ స్టేషన్లో తమపై ఎఫ్ఐఆర్ నమోదైందని... తమపై ఫిర్యాదు చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ బంధువేనని రిట్ పిటిషన్లో ఆరోపించారు. డెహ్రాడూన్ లోని ఓ కాలేజీ మేనేజర్ అయిన హరీందర్ సింగ్ రావత్ తమపై పోలీసులకు ఫిర్యాదు చేశారని... ఆయన సీఎం రావత్ చెల్లెలి భర్త అని పేర్కొన్నారు.
నోట్ల రద్దు సమయంలో...
జర్నలిస్ట్ ఉమేశ్ కుమార్ శర్మ ఈ ఏడాది జూన్లో ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్పై అవినీతి ఆరోపణలు చేస్తూ ఓ వీడియోని ఫేస్బుక్లో అప్లోడ్ చేశారు. 2016లో పెద్ద నోట్ల రద్దు సమయంలో గో సేవా ప్యానెల్ ఛైర్పర్సన్ పదవి కోసం ఓ వ్యక్తి ముఖ్యమంత్రికి లంచం ఇచ్చారని ఉమేశ్ కుమార్ అందులో ఆరోపించారు. ఆ లంచం డబ్బులను సదరు వ్యక్తి ముఖ్యమంత్రి చెల్లెలు సవితా రావత్,ఆమె భర్త హరీందర్ సింగ్ రావత్ బ్యాంకు ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేయించారని ఆరోపించారు. ఆ లావాదేవీలకు సంబంధించిన బ్యాంకు డాక్యుమెంట్స్ కూడా బయటపెట్టారు.
జర్నలిస్టులపై ఎఫ్ఐఆర్...
ఉమేశ్ కుమార్ చేసిన ఈ ఆరోపణలను హరీందర్ సింగ్ రావత్ గతంలోనే ఖండించారు. తాము ముఖ్యమంత్రికి అసలు బంధువులమే కాదన్నారు. ఉమేశ్ ఆరోపణలు పూర్తి నిరాధారమని... తప్పుడు డాక్యుమెంట్లతో తమపై లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉమేశ్ ఆరోపణలపై నెహ్రూ కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది.ఇదే ఎఫ్ఐఆర్లో మరో జర్నలిస్ట్ శివ ప్రసాద్ శర్మ పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తమపై దాఖలైన ఎఫ్ఐఆర్ను సవాల్ చేస్తూ ఇద్దరు జర్నలిస్టులు హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ముఖ్యమంత్రి అవినీతిపై విచారణకు ఆదేశించడం గమనార్హం.
సుప్రీంలో సవాల్ చేసే ఛాన్స్
ముఖ్యమంత్రిపై హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించడంతో రాష్ట్ర బీజేపీ నేతలు షాక్ తిన్నారు. ఈ ఆదేశాలను ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు ముఖ్యమంత్రి రావత్ మీడియా కోఆర్డినేటర్ దర్శన్ సింగ్ రావత్ తెలిపారు. అదే సమయంలో హైకోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తామని... విచారణలో అసలు నిజాలు తేలుతాయని అన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ రావత్ రాజీనామాకు డిమాండ్ చేస్తోంది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తోంది.