Lockdown: కేధార్ నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకం, హరోంహర, మోదీ పేరుతో, 20 మంది !
న్యూఢిల్లీ: భారతదేశంలోని ప్రపంచ ప్రసిద్ది చెందిన పురాతన ఆలయాల్లో ఒకటైన ఉత్తరాఖండ్ లోని కేధార్ నాథ్ లోని శ్రీ కేధారేశ్వరుడికి బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. భారతదేశం మొత్తం కరోనా వైరస్ (COVID 19) లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో కేధారేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. లాక్ డౌన్ నియమాలను పాటిస్తూ కొందరు ఆలయ అర్చకులు, అధికారులు, భద్రతా సిబ్బంది మాత్రమే కేధారేశ్వరుడికి హరోం హరా అంటూ ప్రత్యేక పూజలకు హాజరైనారు. ప్రత్యేకంగా బంతిపూలతో కేధారేశ్వరుడి ఆలయాన్ని అలంకరించారు. హిమాలయాల్లోని కేధారేశ్వరుడి ఆలయంలో బుధవారం ఉదయం జ్యోతిర్లింగాన్ని కొంత మంది మాత్రమే దర్శించుకున్నారు.
Coronavirus: నిత్యానందస్వామి మహత్యం, ఆదేశంలో కరోనా లేదు, రొమాంటిక్ సాంగ్స్, డ్యాన్స్ లు !
లాక్ డౌన్ దెబ్బకు భక్తులు !
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేధారనాథ్ ఆలయంలోని శ్రీ కేధారేశ్వరుడిని ప్రతి సంవత్సరం భక్తలు సందర్శిస్తుంటారు. అయితే కరోనా వైరస్ ను అరికట్టడానికి దేశం మొత్తం లాక్ డౌన్ అమలు చేశారు. ఉత్తరాఖండ్ లో లాక్ డౌన్ నియమాలు కట్టుదిట్టంగా అమలులో ఉన్నాయి. లాక్ డౌన్ అమలులో ఉన్న సందర్బంగా భక్తులు కేధారేశ్వరుడిని దర్శించుకోవడానికి అవకాశం లేకుండా పోయింది.
ఆలయ ప్రధాన పూజారి, 20 మంది !
ఏప్రిల్ 29వ తేదీ ఉదయం 6. 10 గంటలకు కేధారనాథ్ ఆలయం ప్రధాన ద్వారాలు తెరుచుకున్నాయి. కేధారేశ్వర ఆలయం ప్రధాన అర్చకుడు, సహాయ అర్చకులతో పాటు మొత్తం 20 మంది మాత్రమే కేధారేశ్వరుడికి ప్రత్యేక పూజలు చెయ్యడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాక్ డౌన్ అమల్లో ఉన్న సందర్బంగా భక్తులు ఎవ్వరినీ ఆలయం పరిసర ప్రాంతాలకు అనుమతించలేదు.
రుద్రాభిషేకం, మోదీ పేరుతో అర్చన
బుధవారం వేకువ జామున 3 గంటల సమయంలో ఆలయం ప్రధాన ద్వారాలు తెరుచుకున్నాయి. భద్రతా సిబ్బంది సమక్షంలో ఆయలయంలోకి ప్రవేశించిన ప్రధాన అర్చకుడు ఉదయం 6. 10 నిమిషాలకు కేధారేశ్వరుడికి ప్రత్యేక పూజలు చెయ్యడం ప్రారంభించారు. కేధారేశ్వరుడికి రుద్రాభిషేకం చేసిన తరువాత భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరు మీద మొదటి అర్చన చేశారని ఉత్తరాఖండ్ ప్రభుత్వ అధికారులు అంటున్నారు.
భక్తులకు నిరాశ మిగిలింది
ప్రతి సంవత్సరం హిమాలయాల్లోని శ్రీ కేధారనాథ్ ఆలయాన్ని వేల సంఖ్యలో భక్తులు సందర్శిస్తారు. అయితే కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ఈ సంవత్సరం కేధారేశ్వరుడిని దర్శించుకోవడానికి భక్తులు ఎవ్వరికీ అవకాశం ఇవ్వలేదు. 10 క్వింటాల పూలతో మంచుకొండల్లోని కేధారేశ్వర ఆలయాన్ని చూడముచ్చటగా అలంకరించారు.
ఇళ్లలోనే పూజలు చేసిన భక్తులు
పొగ మంచుల్లోని కేధారనాథ్ ఆలయం దగ్గరకు భక్తులను అనుమతించలేదు. హిమాలయాల్లోని కేధారేశ్వర ఆలయంలోని 11వ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడానికి అవకాశం లేకపోవడంతో భక్తులు వారివారి ఇళ్లలోనే పరమశివుడికి పూజలు చేశారు. కరోనా వైరస్ వ్యాధి నుంచి భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల ప్రజలను కాపాడాలని భక్తులు స్వామివారిని వేడుకున్నారు.
భక్తులకు అవకాశం ఇస్తాం
సాధారణంగా ఏప్రిల్ నుంచి నవంబర్ నెలల మధ్యకాలంలో భక్తులు కేధారనాథ్ లోని జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడానికి అవకాశం ఇస్తారు. కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవడానికి లాక్ డౌన్ అమలులో ఉందని, సమదూరం పాటించాలని కేంద్ర ప్రభుత్వం సూచించిందని, అందుకే ఈసారి కేధారేశ్వరుడిని దర్శించుకోవడానికి భక్తులకు అవకాశం ఇవ్వడం లేదని ఉత్తరాఖండ్ కు చెందిన ఓ మంత్రి అంటున్నారు. కేధారనాథ్ ఆలయంలో పాటు భద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాల మీద లాక్ డౌన్ ప్రభావం పడింది. అయితే కరోనా వైరస్ పూర్తిగా కట్టడి అయిన తరువాత కేధారేశ్వరుడిని దర్శించుకోవడానికి భక్తులకు అవకాశం ఇస్తామని ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపింది.