దేవభూమిలో మానవ అస్తిపంజరాల వేట: రుద్రప్రయాగలో పోలీసుల స్పెషల్ డ్రైవ్: 10 టీమ్స్:
డెహ్రాడూన్: దేవభూమిగా గుర్తింపు పొందిన ఉత్తరాఖండ్లో ఏడేళ్ల కిందట సంభవించిన మహా ప్రళయాన్ని ఇప్పట్లో ఎవరూ మరిచిపోలేరు. సుమారు 10 రోజుల పాటు ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలు ఉత్తరాఖండ్ను ముంచి వేశాయి. ప్రత్యేకించి రుద్రప్రయాగ వంటి జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అధికారిక లెక్కల ప్రకారమే అయిదు వేలమందికి జలసమాధి అయ్యారు. కనీవినీ ఎరుగని కల్లోలాన్ని మిగిల్చాయి అప్పటి వరదలు. పర్వతాలకు ఆనుకుని ఉన్న గ్రామాలకు గ్రామాలు కొట్టుకుపోయాయి. కొండచరియలు విరిగిపడటంతో పలువురు గల్లంతయ్యారు.
ఉలిక్కిపడ్డ శాండల్వుడ్: డ్రగ్స్ రాకెట్లో కన్నడ స్టార్ హీరో: నటి, భార్యతో: సీసీబీ విచారణకు
కేదార్నాథ్, చార్ధామ్ యాత్రలకు వెళ్లి..
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం కేదార్నాథ్ సందర్శనకు వచ్చిన భక్తులు, చార్ధామ్ యాత్రలకు వెళ్లిన వారూ ఈ వరదల బారిన పడ్డారు. మృత్యువాత పడ్డారు. 2004లో సంభవించిన సునామీ తరువాత ఉత్తరాఖండ్, కేదార్నాథ్ వరదలను అత్యంత ఘోరమైన విపత్తుగా చెబుతుంటారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వ అంచనాల ప్రకారం 5,700 మందికి పైగా ప్రజలు మరణించారు. వంతెనలు, రోడ్లు ధ్వంసం కావడం వల్ల వేలాది మంది యాత్రీకులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. వారిని సైనికులు కాపాడారు. వైమానిక బలగాలు హెలికాప్టర్ల ద్వారా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
పర్వతాల్లో అస్తిపంజరాల కోసం..
తాజాగా- నాటి మహోత్పాతం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. చర్చనీయాంశమైంది. కారణం- ఆ వరదల్లో మరణించిన వారి అస్తిపంజరాల కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం తాజాగా అన్వేషణ కార్యక్రమాన్ని చేపట్టింది. దీనికోసం స్పెషల్ డ్రైవ్ను ప్రారంభించింది. మొత్తం 10 బృందాలను నియమించింది. రుద్రప్రయాగ, కేదార్నాథ్ పరిసరాల్లోని పర్వత పంక్తుల్లో అస్తిపంజరాలను గాలించడం ఈ బృందాల ప్రధాన విధి. ఉత్తరాఖండ్ పోలీసులు, రాష్ట్ర ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ విభాగం సిబ్బందిని ఇందులో నియమించింది.
10 ప్రత్యేక బృందాలతో డ్రైవ్
2013 నాటి వరదల్లో గల్లంతైన వారి సంఖ్యలో అనుమానాలు వ్యక్తమౌతున్నాయని, వాటిని నిర్ధారించాల్సి ఉందని గర్వాల్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ అభినవ్ కుమార్ తెలిపారు. అస్తిపంజరాలను గుర్తించి, డీఎన్ఏ టెస్టులను నిర్వహిస్తామని చెప్పారు. అప్పటి వరదల వల్ల గల్లంతైన వారెవరూ జీవించి ఉండరని భావిస్తున్నట్లు చెప్పారు. అస్తిపంజరాలను అన్వేషించడానికి మొత్తం 10 స్పెషల్ డ్రైవ్ చేపట్టామని, దీనికోసం 10 బృందాలను ఏర్పాటు చేశామని అన్నారు. ఒక్కో బృందంలో పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బలగాలను చేర్చామని పేర్కొన్నారు.
Recommended Video
ఇప్పటిదాకా 600 అస్తిపంజరాలు..
కేదార్నాథ్ పరిసరాల్లోని వాసుకీతల్, చోరాబాడీ, త్రియుగీ నారాయణ్, గరుడ్ చట్టీ, కాళీమఠ్, చౌమాసీ, ఖామ్, జంగల్ చట్టీ, రామ్బాడా, కేదార్నాథ్ బేస్ క్యాంప్, కేదార్నాథ్ ఎగువ పర్వతాల్లోని భైరవ్నాథ్ ఆలయం, గౌరీకుండ్ వంటి ప్రాంతాల్లో విస్తృతంగా మానవ అస్తిపంజరాల కోసం గాలింపు చర్యలను చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇదివరకు చేపట్టిన గాలింపు చర్యల్లో 600 అస్తిపంజరాలు లభించాయని, వాటికి డీఎన్ఏ టెస్టులను నిర్వహించినట్లు తెలిపారు. కనీసం మూడువేలకు పైగా అస్తిపంజరాలు లభించే అవకాశం ఉన్నట్లు అనుమానిస్తున్నామని చెప్పారు.