మోడీ అప్పుడెందుకు చెప్పలేదు ఆ మాట: ఘోరంగా మోసపోయామంటున్న యూపీ రైతులు..
ఎన్నికలకు ముందు ఒకలా.. ఎన్నికల తర్వాత మరోలా.. రాజకీయ పార్టీల నిజస్వరూపం బయటపడేది ఎన్నికల తంతు ముగిసిన తర్వాతే. అప్పటిదాకా ఏం చేసినా.. ఏ హామిలిచ్చినా.. అవన్ని పార్టీ గెలుపు కోసమే తప్ప, జనాల మీద చిత్తశు
మధుర: ఎన్నికలకు ముందు ఒకలా.. ఎన్నికల తర్వాత మరోలా.. రాజకీయ పార్టీల నిజస్వరూపం బయటపడేది ఎన్నికల తంతు ముగిసిన తర్వాతే. అప్పటిదాకా ఏం చేసినా.. ఏ హామిలిచ్చినా.. అవన్ని పార్టీ గెలుపు కోసమే తప్ప, జనాల మీద చిత్తశుద్దితో కాదు. తాజా యూపీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన బీజేపీ సైతం ఇప్పుడిదే బుద్దిని బయటపెట్టుకుంటుంది.
ఎన్నికలకు ముందు బేషరుతుగా రుణమాఫీ చేస్తామని హామి ఇచ్చిన బీజేపీ.. తీరా ఇప్పుడు మాట మార్చేసింది. కేవలం 2016-17 సంవత్సరంలో తీసుకున్న లక్ష రూపాయల లోపు రుణాలకు మాత్రమే మాఫీ వర్తిస్తుందని తేల్చి చెప్పింది. దీంతో ప్రభుత్వం మాటలు విని మోసపోయాని యూపీ రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వ వైఖరి ఆకలితో ఏడుస్తున్న పిల్లాడికి లాలీపాప్ తెచ్చి చేతిలో పెట్టినట్లుందని మథుర జిల్లాలోని కేదార్ సింగ్ అనే రైతు ఎద్దేవా చేశారు.
ఎన్నికల సందర్బంగా నిర్వహించిన సమావేశాల్లో అబద్దపు హామిలతో తమను మోసం చేశారని, తాము ఘోరంగా మోసం పోయామని రాజన్ సింగ్ అనే మరో రైతు ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం రైతులందరికి రుణమాఫీ జరుగుతుందని భావిస్తే.. ప్రభుత్వం మాత్రం లేని నిబంధనను తీసుకొచ్చిందని మథుర తాలుకాలోని దామోదర్ పురా గా్రమ సర్పంచ్, రైతు దేవిసింగ్ చెప్పారు.
ఎన్నికల సందర్బంగా నిర్వహించిన బీజేపీ సమావేశాల్లో ప్రధాని మోడీ దీనిపై స్పష్టతనివ్వలేదని, ఎవరెవరికి రుణమాఫీ వర్తిస్తుందో వెల్లడించలేదని అక్కడి రైతులు అంటున్నారు. తీరా అధికారంలోకి వచ్చాక కొంతమందికి మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందని చెప్పడం.. ఇదంతా కేవలం కంటితుడుపే చర్యేనని రైతులు తమ గోడు వెల్లబోసుకుంటున్నారు.
వర్షాభావం వల్ల గత మూడేళ్ల నుంచి రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని, ఇలాంటి సమయంలో కేవలం లక్ష రూపాయల లోపు రుణాలే మాఫీ చేస్తామంటే.. ఇది సముద్రంలో నీటిబొట్టు వేయడం లాంటిదేనని దీన్ దయాళ్ గౌతమ్ అనే రైతు అభిప్రాయపడ్డారు.
ఇక మరికొంతమంది రైతుల వాదన మాత్రం మరోలా ఉంది. సాధారణంగా చిన్న రైతులకు బ్యాంకులు లక్ష రూపాయలకు మించి రుణం ఇవ్వవని, కాబట్టి లక్ష రూపాయల లోపు రుణమాఫీ తమకు ఆమోదయోగ్యమేనని కుశాల్ సింగ్ అనే రైతు చెప్పారు. అయితే కేవలం ఒక సంవత్సరానికే దీన్ని పరిమితం చేయడం వల్ల చాలామంది నష్టపోయే ప్రమాదముందన్నారు.
కాగా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రుణమాఫీ కింద రూ.36,359కోట్లను రుణమాఫీ చేస్తున్నట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. దీనివల్ల కేవలం 86వేల మంది రైతులు మాత్రమే లబ్ది పొందుతారని, పైగా దీన్ని ఒక సంవత్సారికే పరిమితం చేయడం మమ్మల్ని మోసం చేయడమేనని యూపీ రైతులు ఆవేదన చెందుతున్నారు.