తెలంగాణ ఇచ్చినందుకే: కాంగ్రెసులో చేరిన వి - బ్రదర్స్
న్యూఢిల్లీ: తాము కాంగ్రెసులో చేరిన విషయాన్ని పార్లమెంటు సభ్యుడు జి. వివేక్, ఆయన సోదరుడు జి. వినోద్ ధ్రువీకరించారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ తర్వాత వారు తాము కాంగ్రెసులోకి తిరిగి వచ్చినట్లు తెలిపారు. వారితో పాటు ఆదిలాబాద్ మాజీ పార్లమెంటు సభ్యుడు ఇంద్రకరణ్ రెడ్డి కూడా కాంగ్రెసులో చేరారు. కాంగ్రెసు తెలంగాణ ఇచ్చిందని, తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరిందని వివేక్ చెప్పారు.
కాంగ్రెసు అధిష్టానం సూచన మేరకు తాము ఆ పార్టీలో చేరినట్లు ఆయన చెప్పారు. తెలంగాణ రాకుండా ఎన్నో శక్తులు అడ్డుకున్నాయని ఆయన చెప్పారు. తెలంగాణ సాధనకు ఎన్నో కష్టాలు పడ్డామని ఆయన అన్నారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తెలంగాణపై సోనియా గాంధీ మాట మార్చలేదని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి తప్పుడు నివేదికలు చూసి తట్టుకోలేక తాము పార్టీ మారామని ఆయన చెప్పారు.
తమ తండ్రి వెంకటస్వామి, సోనియా గాంధీ మార్గదర్శకత్వంలో నడుచుకుంటామని వినోద్ చెప్పారు. సోనియా గాంధీ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యంతో తాము తిరిగి కాంగ్రెసులోకి వచ్చామని ఆయన చెప్పారు. ప్రస్తుత తరుణంలో తెలంగాణను తెచ్చిన విధానాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లాల్సిన బాధ్యత తమపై ఉందని ఆయన అన్నారు.
వివేక్, వినోద్ గత కొద్ది రోజులుగా కాంగ్రెసు అధిష్టానం పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. అప్పటి నుంచే వారు కాంగ్రెసులో చేరుతారనే ప్రచారం సాగుతోంది. వివేక్ పెద్దపల్లి లోకసభ స్థానం నుంచి తిరిగి కాంగ్రెసు తరఫున పోటీ చేసే అవకాశం ఉంది. వినోద్కు శాసనసభ సీటు ఇచ్చే అవకాశం ఉంది.