సొంత లాభం కొంత మానుకో: ప్రధాని మోడీ నోట గురజాడ సాహిత్యం: పొరుగు వారికి వ్యాక్సిన్ అందుకే
న్యూఢిల్లీ: దేశ చరిత్రలో మరో సువర్ధాధ్యాయం ఆరంభమైంది. ప్రాణాంతక కరోనా వైరస్ను నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొద్ది సేపటి కిందటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వర్చువల్ విధానంలో దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అన్ని రాష్ట్రాల్లో ఎంపిక చేసిన కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ చరిత్రలో ఓ చారిత్రక ఘట్టానికి శ్రీకారం చుట్టామని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్గా ఇది గుర్తింపు పొందింది.
మోడీ భావోద్వేగం: వారి రుణాన్ని తీర్చుకుంటున్నాం: ఎన్నో యుద్ధాలతో సమానం
గురజాడను ప్రస్తావించిన ప్రధాని..
సొంత లాభం కొంత మానుకో పొరుగు వానికి తోడుపడవోయ్..దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్. ప్రఖ్యాత తెలుగు సాహితీ వేత్త గురజాడ అప్పారావు రాసిన ఈ కవితను ప్రధానమంత్రి తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఈ పద్యాన్ని ఆయన పలికారు. ప్రతి ఒక్కరూ తమ సొంతలాభాన్ని కొంత మానుకుని,.. పొరుగు వారి కోసం తోడ్పడాలంటూ తెలుగు కవి గురజాడ అప్పారావు ఏనాడో చెప్పారని ప్రధాని ఉటంకించారు. ఆయన చూపిన మార్గాన్ని దేశ ప్రజలందరూ అనుసరించాలని పిలుపునిచ్చారు. ఆయన చూపిన మార్గానికి అనుగుణంగా.. తాము ఇతర దేశాలకు కూడా వ్యాక్సిన్ను సరఫరా చేస్తామని అన్నారు.
లాక్డౌన్ నాటి పరిస్థితులు..
లాక్డౌన్ నాటి పరిస్థితుల గురించి నరేంద్ర మోడీ వివరించారు. 130 కోట్ల మంది ప్రజలను ఇంటికే పరిమితం చేయడం అతి పెద్ద సవాలుగా మారిందని, దీన్ని స్వీకరించడమే కాకుండా.. సమర్థవంతంగా అమలు చేశామని పేర్కొన్నారు. ఇన్ని కోట్ల మంది ప్రజలను కొన్ని నెలల పాటు ఇళ్లకే పరిమితం చేయడంతోనే.. భారత్ శక్తి సామర్థ్యాలు ఏమిటో ప్రపంచ దేశాలను తెలుసుకోగలిగాయని అన్నారు. లాక్డౌన్: వల్ల ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉన్నస్పటికీ.. ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని.. లాక్డౌన్ను అమలు చేయాల్సి వచ్చిందని అన్నారు.
రోజుల తరబడి ఇళ్లకు వెళ్లలేదు..
ప్రపంచం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొందన్నప్పటికీ, అంటువ్యాధులను తట్టుకున్నప్పటికీ.. మరెన్నో యుద్ధాలను చవి చూసినప్పటికీ.. కరోనా వైరస్ వంటి మహమ్మారిని మాత్రం ఎదుర్కొనలేదని అన్నారు. శాస్త్రవేత్తలు, పరిశోధకులకు కూడా ఇది అంతు చిక్కలేదని అన్నారు. అలాంటి వైరస్పై ఈ కఠోర పోరాటంలో ఫ్రంట్లైన్ వర్కర్లు విజయం సాధించారని చెప్పారు. డాక్టర్లు, హెల్త్కేర్ వర్కర్లు, పోలీసులు రోజుల తరబడి ఇళ్లకు వెళ్లకుండా కరోనా వైరస్ బారిన పడిన పేషెంట్ల సేవలో, దాన్ని కట్టడి చేయడంలో నిమగ్నం అయ్యారని పేర్కొన్నారు.