డిసెంబర్ నాటికి కరోనా టీకా, కానీ, యూకే ట్రయల్స్, డీసీజీఐ అనుమతే కీలకం: సీరం సీఈఓ పూనావాలా
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్పై సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఎస్ఐ) సీఈవో అదర్ పూనావాలా కీలక ప్రకటన చేశారు. పుణెకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ రూపొందిస్తున్న కరోనా వ్యాక్సిన్ ఈ ఏడాది డిసెంబర్ నాటికి అందుబాటులోకి రావచ్చని తెలిపారు. వంద మిలియన్ డోసులు వచ్చే ఏడాది రెండు లేదా మూడో త్రైమాసికానికి సిద్ధమవుతాయని చెప్పారు.
అదర్ పూనావాలా బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. టీకా అందుబాటులోకి వచ్చే సరైన సమయం యూకేలో నిర్వహిస్తున్న ట్రయల్స్, డీసీజీఐ ఆమోదంపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. అత్యవసర అనుమతికి దరఖాస్తు చేసుకోకపోతే.. డిసెంబర్లో క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసి, వచ్చే ఏడాది జనవరి నాటికి భారత్లో వ్యాక్సిన్ను తీసుకొస్తామని, ఆ సమయానికి యూకేలోనూ ట్రయల్స్ పూర్తవుతాయని తెలిపారు.
కరోనా టీకాపై యూకే అధ్యయనానికి సంబంధించిన సమాచారాన్ని పంచుకుని సురక్షితమేనని తేలినప్పుడు రెండు మూడు వారాల్లో అత్యవసర అనుమతి డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంటామన్నారు. అత్యవసర అనుమతికి దరఖాస్తు చేస్తే డిసెంబర్ నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తామని తెలిపారు. అయితే, ఈ అంశంపై కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంటుందన్నారు అదర్ పూనావాలా.
100 మిలియన్ డోసులను అందుబాటులోకి తేవడం లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. అది 2021 రెండు లేదా మూడో త్రైమాసికానికి పూర్తవుతుంద్నారు. వ్యాక్సిన్ రెండు డోసులుగా ఉంటుందని, ఒక్కో డోసుకు మధ్య 28 రోజులు వ్యవధి ఉంటుందని పూనావాలా తెలిపారు. సీరం వ్యాక్సిన్ అందుబాటులో ఉండే ధరకే(రూ. 100 అంచనా) లభిస్తుందని వివరించారు.