కరోనా వ్యాక్సిన్ ఉచితంగానే ఇవ్వాలి, ఒకే ధర ఉండాలి: సుప్రీంకోర్టుకు మమతా బెనర్జీ సర్కారు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యాక్సినేషన్ పాలసీని వ్యతిరేకిస్తూ, దేశమంతా యూనిఫాం ఒకే వ్యాక్సినేషన్ విధానం ఉండాలని కోరుతూ సుప్రీంకోర్టులో పశ్చిమబెంగాల్ మమతా బెనర్జీ సర్కారుకు పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్రాలకు, ప్రైవేటు వ్యక్తులకు ఒక్కోలా ధర నిర్ణయించేందుకు అవకాశం కల్పిస్తూ కేంద్రం తెచ్చిన టీకా విధానాన్ని రద్దు చేయాలని కోరింది.
అంతేగాక, దేశంలో కరోనా మహమ్మారి కట్టడిలో బ్రహ్మాస్త్రంగా మారిన ఈ వ్యాక్సిన్లను అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగానే పంపిణీ చేయాలని పిటిషన్లో పేర్కొంది. రాష్ట్రాలకు వ్యాక్సిన్ల కొరత తీర్చడంతోపాటు ఉచితంగా సరఫరా చేసేలా కేంద్రం తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. కాగా, వ్యాక్సినేషన్ పాలసీ సంబంధిత అంశాలపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరుపనుంది.
దేశంలో మే 1 నుంచి 45ఏళ్లుపైబడినవారితోపాటు 18-44ఏళ్ల వయస్కులకు కూడా కరోనా వ్యాక్సిన్ వేయాలంటూ కేంద్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, పలు రాష్ట్రాలు టీకాలు అందుబాటులో లేకపోవడంతోపాటు టీకాల ధరల్లో వ్యత్యాసాలపై బీజేపీయేతర ప్రభుత్వాలు, పార్టీలు ఫిర్యాదులు చేస్తున్నాయి.
సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఒక డోసును రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 400లకు విక్రయిస్తుండగా, ప్రైవేటు ఆస్పత్రులకు రూ. 600కు ఇస్తోంది. భారత్ బయోటెక్ సంస్థ తన కోవాగ్జిన్ టీకాను రాష్ట్రాలకు రూ. 600లకు విక్రయిస్తుండగా.. ప్రైవేటు ఆస్పత్రులకు రూ. 1200ల చొప్పున ధరను నిర్ణయించాయి. ఈ రెండింటితోపాటు మరికొన్ని వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి.