గుజరాత్: కొవిడ్ వార్డులో అగ్నిప్రమాదం - వడోదర ఎస్ఎస్జీ ఆస్పత్రిలో ఘోరం - రంగంలోకి రెస్క్యూ టీమ్స్
దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతోన్న దశలో ఆస్పత్రుల్లో భద్రతా లోపాటు ప్రజలపాలిట శాపాలుగా మారాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో స్వర్ణప్యాలెస్ కొవిడ్ సెంటర్ లో భారీ అగ్నిప్రమాదం ఉదంతాన్ని మర్చిపోకముందే.. ప్రధాని నరేద్ర మోదీ ఇలాకా గుజరాత్ లో మరో ఘోరప్రమాదం చోటుచేసుకుంది.
గుజరాత్ లోని వడోదర సిటీలోగల శ్రీ సాయాజీరావ్ జనరల్ ఆస్పత్రిలో మంగళవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అక్కడి కొవిడ్ వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రోగులు భయంతో పరుగులు తీశారు. నిమిషాల్లోనే మంటలు పక్కనున్న ఎమర్జెన్సీ వార్డుకు కూడా వ్యాపించాయి. వేడిమికితోడు దట్టమైన పొగలు వ్యాపించడంతో రోగులు, ఆస్పత్రి సిబ్బంది ఉక్కిరిబిక్కిరయ్యారు.
ఎస్ఎస్జీ ఆస్పత్రిలో ప్రమాదం సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక శాఖ రెస్క్యూ బృందాలు తరలివెళ్లాయి. ఒవైపు మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తూనే, లోపల చిక్కుకున్న రోగులు, సిబ్బందిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చేప్రయత్నం చేశారు. కొవిడ్, ఎమర్జెన్సీ వార్డుల్లోని రోగుల్ని వేరే ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనలో ప్రాణనష్టం జరిగిందా, లేదా అనే వివరాలు తెలియాల్సి ఉంది..