వీఐపీ కల్చర్ వద్దంటూనే ఇదేంటి : ప్రహ్లాద్ ఇష్యూపై వాద్రా పైర్
న్యూఢిల్లీ : ప్రధాని మోడీపై రాబర్ట్ వాద్రా విమర్శలు గుప్పించారు. ఓ వైపు వీఐపీ సంస్కృతి వద్దని మోడీ చెబుతోంటే.. మరోవైపు, ఆయన కుటుంబ సభ్యులే ఈ విషయాన్ని పట్టించుకోవట్లేదని ఫైరయ్యారు.
ఇదేనా అచ్చేదిన్
తన భద్రతాసిబ్బందికి ప్రత్యేక వాహనం కేటాయించాలంటూ మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ మంగళవారం రాజస్థాన్లో ఆందోళనకు దిగారు.వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఆయనతో పాటు ఒకే వాహనంలో వెళ్లాల్సి ఉండగా, ఇందుకు ఒప్పుకోని ప్రహ్లాద్.. వారిని తన వాహనంలో తీసుకెళ్లడం కుదరదని తేల్చిచెప్పారు. ఈ విషయాన్ని వాద్రా గుర్తు చేశారు. 'ఇతరుల్లో ఉన్న చెడు అలవాటు మనలోనూ ఉన్నప్పుడు, ఇతరులను అదే విషయంపై విమర్శించొద్దన్న సూక్తి మన ప్రధాని మోదీకి వర్తిస్తుంది. వీఐపీ సంస్కృతి ఎందుకంటూ ఆయన ప్రతి ఒక్కరిని విమర్శిస్తారు. ఇప్పుడు ఆయన సోదరుడే తన భద్రతా బలగాలకు ప్రత్యేక వాహనం కావాలంటూ ధర్నాకు దిగారు. ఇదేనా అచ్ఛేదిన్?' అని ఫేస్బుక్లో విమర్శించారు.
భద్రత కుదించారు
'రెండేళ్ల క్రితం భద్రతా సిబ్బందిని సగానికి తగ్గించారు. అందుకు అంగీకరించాను. నా విషయంలోనే కాదు.. మా అమ్మ ఉంటున్న ఇంటి వద్ద ఉండే ఇద్దరు భద్రతా బలగాలను కూడా తొలగించారు. దీన్ని కూడా మేం వ్యతిరేకించలేదు. కానీ, ఇప్పుడు చూడండి... భద్రతా బలగాలకు వాహనం కావాలంటూ మోదీ సోదరుడు ధర్నాకు దిగిన విషయాన్ని ప్రస్తావించారు.