రాష్ట్ర విభజన: 371 డిపై అటార్నీ జనరల్ కీలక నివేదిక
సవరణతోనే ప్రత్యేక హోదా తొలగిపోతుందని, సవరణ లేకుండా రెండు రాష్ట్రాల్లో 371-డి ని కొనసాగించడం కష్టమని అటార్నీ జనరల్ పేర్కొన్నారు. 371-డిని తొలగించాకే విభజన బిల్లు ప్రవేశపెట్టాలని నివేదికలో తెలిపారు. సవరణ తప్పనిసరి అంటూ అటార్నీ జనరల్ తెలపడంతో మంత్రుల బృందం న్యాయశాఖను సంప్రదించనున్నట్లు తెలుస్తోంది.
అసలు రాష్ట్ర విభజన అంటూ జరిగితే ఇక 371 డి అధికరణ వర్తించబోదని అందులో స్పష్టం చేశారు. అలా కాదని ఒకవేళ ప్రత్యేక హోదా కావాలనుకుంటే మాత్రం రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.
తెలంగాణ ఏర్పాటు చేస్తే ఇక ఆ తర్వాత మిగిలిన రాష్ట్రాలకు అది వర్తించే అవకాశమే ఉండబోదని వాహనావతి చెప్పినట్లుగా తెలుస్తోంది.
అధికారులతో షిండే, జైరాం చర్చలు
మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే, జైరామ్ రమేష్ అంశాల వారీగా అధికారులతో చర్చలు జరుపుతున్నారు. రాజ్యాంగ, న్యాయపరమైన అంశాలను కూడా సమీక్షిస్తున్నారు. అధికారులతో షిండే, జైరాంలు మంగళవారం మూడు గంటల పాటు భేటీ అయ్యారు. బుధవారం ఉదయం మరోసారి భేటీ కానున్నరు.