చీలిక: ఎన్డీఏ ప్రభుత్వం నుంచి తప్పుకున్న ఎండీఎంకే వైగో
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం నుంచి వైగోకు చెందిన ఎండీఎంకే తప్పుకోనున్నట్లు సోమవారం వార్తాకథనాలు వస్తున్నాయి. శ్రీలంకలోని మహేంద్ర రాజపక్సే ప్రభుత్వంతో ప్రధాని మోడీ ప్రభుత్వం మంచి సంబంధాలను కొనసాగిస్తుండటంతో వైగో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
శ్రీలంక తమిళుల వ్యవహారంలో తమిళనాడు ప్రజలను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మోసం చేసిందని ఎల్టీటీఈ మద్దతుదారైన వైగో (70) ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం భారతదేశం యొక్క విద్య మరియు సంస్కృతిని చెడగొట్టేందుకు ప్రయత్నస్తుందని ఆరోపించారు.
ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నుంచి వైగోకి చెందిన ఎండీఎంకేను తప్పించాలని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి బహిరంగంగానే ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రధాని మోడీని విమర్శించినట్లైతే వైగో 'సురక్షితంగా తిరిగి ఇంటికి చేరుకోలేరు' అని సీనియర్ లీడర్ హెచ్ రాజా అన్నారు.
శ్రీలంకలో ఉన్న తమిళ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై ప్రధాని మోడీ ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. గతంలో వైగో ఎమ్ జీ రామచంద్రన్, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కరుణానిధిని విమర్శించినా... ఏనాడు బెదిరింపులు ఎదుర్కొనలేదని చెప్పాడు.
ఈ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసిన ఎండీఎంకే పోటీ చేసింది. భారతీయ జనతా పార్టీ కన్యాకుమారి ఎంపీ సీటుని కైవసం చేసుకోవడంలో ఎండీఎంకే పార్టీ కీలకపాత్ర పోషించింది. డీఎంకే నుంచి విడిపోయి వైగో ఎండీఎంకే పార్టీని 1993లో ప్రారంభించారు.
ఇటీవల నేపాల్ రాజధాని ఖాట్మండ్లో జరిగిన 18వ సార్క్ సదస్సులో శ్రీలంక అధ్యక్షుడు మహేంద్ర రాజపక్సేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పలకరించడాన్ని వైగో ఖండించారు. " సార్క్ సదస్సులో ప్రధానమంత్రి మోడీ వైఖరికి నేను చింతిస్తున్నా. పలువురు తమిళులను చంపిన వ్యక్తితో అలా వ్యవహరించడం సరైంది కాదు. ఇందుకు నేను సిగ్గుపడుతున్నా, ఖండిస్తున్నా" అని వైగో అన్నారు.