వైకోకు సుప్రీంకోర్టులో నిరాశ..హేబియస్ కార్పస్ పిటిషన్ కొట్టేసిన ధర్మాసనం
న్యూఢిల్లీ: నిర్భంధంలో ఉన్న జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఎండీఎంకే నేత వైకో సుప్రీంకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయగా దాన్ని ధర్మాసనం కొట్టివేసింది. ఈ కేసును విచారణ చేసిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్... పిటిషనర్ దాఖలు చేసిన పిటిషన్లో తనకు ఏదీ సవ్యంగా కనిపించడం లేదని చెప్పారు. జమ్మూకశ్మీర్ ప్రజారక్షణ చట్టం కింద సెప్టెంబర్ 16న ఫరూక్ అబ్దుల్లాను నిర్బంధించడం జరిగింది.
ఎండీఎంకే నేత వైకోవేసిన పిటిషన్ సరైన పద్దతిలో లేనందున మరోసారి చెక్ చేసుకుని పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని న్యాయమూర్తి పేర్కొన్నారు. నిర్బంధంపై వైకో దాఖలు చేసిన పిటిషన్ కోర్టుముందుకు విచారణ కోసం రావాల్సి ఉండగా... సెప్టెంబర్ 16న తెల్లవారు జామున ఫరూక్ అబ్దుల్లాను నిర్బంధంలోకి తీసుకున్నారు. జమ్మూ కశ్మీర్లో ఆగష్టు 5వ తేదీన ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుంచి ఫరూక్ అబ్దుల్లా గృహ నిర్బంధంలో ఉన్నారు. సీజేఐ రంజన్ గొగోయ్, జస్టిస్ బాబ్డే మరియు జస్టిస్ అబ్దుల్ నజీర్లు ఈ కేసును విచారణ చేశారు.
తమిళనాడు నుంచి రాజ్యసభ సభ్యునిగా ఉన్న వైకో... ఫరూక్ అబ్దుల్లాను నిర్భంధం నుంచి విడుదల చేయాల్సిందిగా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని అబ్దుల్లాను సుప్రీంకోర్టులో హాజరు పర్చేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఎందుకంటే చెన్నైలో సెప్టెంబర్ 15న ఫరూక్ అబ్దుల్లా ఓ కాన్ఫిరెన్స్లో పాల్గొనాల్సి ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి సీఎన్ అన్నాదురై జయంతి ఉత్సవాల్లో అబ్దుల్లా పాల్గొనాల్సి ఉందని వైకో తన పిటిషన్లో పేర్కొన్నారు. ఆగష్టు 5 నుంచి తాను అందుబాటులో లేరని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
అబ్దుల్లా చెన్నైకి వచ్చేలా అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆగష్టు 28న వైకో సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. అయితే ఎలాంటి సమాధానం రాలేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఒక వ్యక్తిని అన్యాయంగా గృహనిర్భంధంలో ఉంచడం తన ప్రాథమిక హక్కులకు భంగం కలగజేస్తున్నట్లే అని పిటిషన్లో పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్లో కేంద్ర అప్రకటిత ఎమర్జెన్సీని విధించిందని చెప్పిన వైకో... రాష్ట్రం మొత్తం గత నెలరోజులుగా అంధకారంలోకి నెట్టివేయబడిందని వెల్లడించారు. అంతేకాదు ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా ఎన్నుకోబడ్డ నేతలను నిర్బంధించడం అన్యాయమని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు వైకో.