మాటలేకాదు, మౌనమూ ఆయన ఆయుధమే - వాజపేయి వర్ధంతిన జాతి నివాళి - సదైవ్ అటల్ వద్ద నేతల పుష్పాంజలి
''అటల్జీ చేసిన మంచిని ఈ దేశం ఎన్నటికీ మర్చిపోదు. ఆయన నేతృత్వంలో భారత్ పరమాణు శక్తిలోనూ ముందడుగు వేసింది. నేతగా, పార్లమెంట్ సభ్యుడిగా, మంత్రిగా, ప్రధానమంత్రిగా ఆయన సరికొత్త ఆదర్శాలు నెలకొల్పారు. అటల్ జీవితంలోని ప్రతి అంశమూ స్ఫూర్తిదాయకమే. ఆయన ఎంత గొప్పగా మాట్లాడేవారో, అంతకంటే గొప్ప బలం తన మౌనంలో ఉండేది. సభలో మాటల మధ్యలో మౌనాన్ని కూడా ఆయుధంగా వాడిన తీరు ప్రజల్ని ఆలోచింపజేసింది. ఆ మౌనం నుంచే మెసేజ్ వెళ్లేది. వాజపేయి వర్ధంతి సందర్భంగా ఆయనకిదే నా శ్రద్ధాంజలి'' అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక వీడియోలో పేర్కొన్నారు.
మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి రెండో వర్ధంతి సందర్భంగా ఆదివారం యావత్ జాతి ఆయనకు ఘన నివాళులు అర్పించింది. ఢిల్లీలోని ఆయన స్మారక స్థలి 'సదైవ్ అటల్' వద్ద రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సహా కేంద్ర పెద్దలంతా పుష్పాంజలి ఘటించారు.
#WATCH Delhi: President Ram Nath Kovind, Vice President M Venkaiah Naidu & Prime Minister Narendra Modi pay tribute to former PM #AtalBihariVajpayee, on his death anniversary today at 'Sadaiv Atal' - the memorial of Atal Bihari Vajpayee. pic.twitter.com/pIaYOZFIMZ
— ANI (@ANI) August 16, 2020
అటల్ సేవలను ఈ దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని రాష్ట్రపతి కోవింద్ పేర్కొనగా, ఈ తరంలో గొప్ప వక్త, పరిపాలనకర్త, జాతీయవాద కవి, ఉదారప్రజాస్వామికవాదిగా వాజపేయి గుర్తుండిపోతారని ఉపరాష్ట్రపతి వెంకయ్య వ్యాఖ్యానించారు. 'సదైవ్ అటల్' స్మారక స్థలి వద్ద వాజపేయి కూతురు నమితా కౌల్, మనవరాలు నిహారిక సహా కుటుంబీకులు కూడా శ్రద్ధాంజలి సమర్పించారు.
1924, డిసెంబర్ 25న మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో జన్మించిన వాజపేయి, బీజేపీ తరఫున ప్రధానిగా ఎన్నికైన తొలి వ్యక్తిగా రికార్డు సాధించారు. మొత్తం మూడు సార్లు ఆ పదవిని చేపట్టిన ఆయన, 1996లో 16 రోజులు, 1998 నుంచి 1999 వరకు ఏడు నెలల పదవీకాలం తర్వాత 1999 ఎన్నికల్లో ఘన విజయంతో ఐదేళ్లపాటూ(2004 దాకా) ప్రధానిగా కొనసాగారు. వృద్ధాప్యం, మతిమరుపు తదితర సమస్యలతో బాధపడిన ఆయన,93 ఏళ్ల వయసులో 2019 ఆగస్టు 16న ఢిల్లీలోని ఎయిమ్స్ లో కన్నుమూశారు.