ఓడిపోతున్నాం: 2004 ఫలితాల్ని ముందే ఊహించిన వాజపేయి, 'మళ్లీ మోడీదే గెలుపు'
న్యూఢిల్లీ: 2004లో దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని అనుకోలేదని ఆయనకు సహాయకుడిగా పని చేసిన శివకుమార్ పారీఖ్ అన్నారు. ఆయన లేని లోటు ఇప్పుడు తెలుస్తోందన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. 2004లో భారత్ వెలిగిపోతోంది అనే నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్లలేదని, ముందస్తుకు వెళ్లడం 2004లో ఓటమికి ముఖ్య కారణమని ఆయన చెప్పారని తెలిపారు.
ముందస్తుకు వెళ్లడం ఆయనకు ఏమాత్రం ఇష్టం లేదని, ఒత్తిడి కారణంగానే ఆయన వెళ్లారని చెప్పారు. లక్నోలో ప్రచారం ముగించుకున్న తర్వాత వచ్చిన వాజపేయి.. మనం ఓడిపోతున్నామని, ప్రభుత్వం పడిపోతుందని చెప్పారని గుర్తు చేసుకున్నారు. ఎలా చెబుతున్నారని అడగ్గా.. ప్రజలతో తిరిగి ప్రచారం చేశానని చెప్పారని అన్నారు. కాగా పారీఖ్ అయిదు దశాబ్దాల పాటు ఆయనతో కలిసి నడిచారు.
నరేంద్ర మోడీ పాలన గురించి అడగగా.. ఇది రాజకీయానికి సంబంధించినదని, ఎవరిని పొగిడినా విమర్శించినా మనస్ఫూర్తిగా ఆ పని చేస్తానని పారీఖ్ చెప్పారు. వాజపేయి అడుగుజాడల్లో అంటే ఆయనలా జీవించడమో, ఆయనలో మెలగడమో, ఆయనలా ఉండడమో కాదన్నారు. వాజపేయి నిర్మించిన బలమైన పునాదుల కారణంగా 2014లో బీజేపీ గెలిచిందన్నారు. ఇప్పుడు 19 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండటానికి ఆయన వేసిన పునాది కారణం అన్నారు.
మోడీ ప్రభుత్వం చాలా సమర్థవంతంగా పని చేస్తోందన్నారు. వాజపేయి ఆశయాలకు అనుగుణంగా పలు పథకాలను ప్రవేశ పెట్టిందన్నారు. ఇప్పుడు ఉన్న సీట్ల సంఖ్య కొంత తగ్గినా వచ్చే ఎన్నికల్లో బీజేపీనే గెలుస్తుందన్నారు.