చంద్రబాబు నివాళి: వాజ్పేయి రాజకీయాలకు నూతన నిర్వచనం తీసుకొచ్చారు
Recommended Video
మాజీ ప్రధాని వాజ్పేయి పార్థీవ దేహానికి తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖులు నివాళులు అర్పించారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ నివాళులు అర్పించారు. దేశం ఒక గొప్ప నాయకుడిని వక్తను కోల్పోయిందని అన్నారు. వాజ్పేయి భౌతిక కాయానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సీఎంగా ఉండి ఇద్దరూ రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పనిచేసినట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తుచేసుకున్నారు.
వాజ్పేయి అన్ని సంస్కరణలకు ఆద్యుడని బాబు కొనియాడారు. టెలికమ్యూనికేషన్స్, నేషనల్ హైవేస్, మైక్రో ఇరిగేషన్, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్తో సహా మరెన్నో సంస్కరణలు దివంగత మాజీ ప్రధాని తీసుకొచ్చారని చంద్రబాబు తెలిపారు. వాజ్పేయి లేని లోటు పూడ్చలేదని చెప్పారు. నాడు హైటెక్ సిటీని వాజ్పేయి ప్రారంభించారని చెప్పిన చంద్రబాబు... రాష్ట్రపతి ఎన్నికల సమయంలో వారు అలెగ్జాండర్ పేరును ప్రతిపాదించగా...తాను అబ్దుల్ కలాం పేరును ప్రతిపాదించినట్లు చెప్పారు. ఆ తర్వాత వాజ్పేయి ఆలోచించి అబ్దుల్ కలాంకే ఓకే చెప్పినట్లు చంద్రబాబు వెల్లడించారు.
వాజ్పేయిది మంచి కలుపుగోలుతనం అని చెప్పిన చంద్రబాబు... రాజకీయాలకు వాజ్పేయి ఒక నూతన నిర్వచనం తీసుకొచ్చారని చెప్పారు. హైదరాబాద్ ఎయిర్పోర్టు కూడా ఆయన చలవేనని చంద్రబాబు కొనియాడారు. వాజ్పేయి నిర్ణయాలు చాలా ఆలోచించి తీసుకునేవారని చంద్రబాబు చెప్పారు.వాంబే (వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన) పథకానికి ఏపీ నుంచే అంకురార్పణ జరిగిందని చెప్పారు. లోక్సభలో స్పీకర్గా ఒక మంచి వ్యక్తిని ఎంపిక చేయమని వాజ్పేయి తనను అడిగినప్పుడు... బాలయోగి పేరు సూచించినట్లు చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. వాజ్పేయికి నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో ఎంతో మంచి అనుబంధం ఉండేదని చంద్రబాబు చెప్పారు.