ఓటరు జాబితా నుండి వాజ్పేయ్ పేరు తొలగింపు, ఎందుకంటే?
మాజీ ప్రధాన మంత్రి, భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి పేరును ఓటర్ల జాబితా నుంచి తొలగించారు.
లక్నో: మాజీ ప్రధాన మంత్రి, భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి పేరును ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. లక్నో పురపాలక సంఘం ఒకటో జోన్ జోనల్ అధికారి అశోక్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఓటర్ల జాబితా సవరణ సందర్భంగా వాజ్పేయి పేరును జాబితా నుంచి తొలగించారు.
వాజ్ పేయ్ బనారసీ దాస్ ఓటరు. 92/98-1 నంబరు ఇంటిలో ఆయన ఓటరుగా నమోదయ్యారు. ఆయన ఓటరు సంఖ్య 1,054. పదేళ్ళుగా ఆయన ఓటు వేయడం లేదు. 2000వ సంవత్సరంలో జరిగిన పురపాలక సంఘం ఎన్నికల్లో చివరిసారి ఓటు వేశారు.
2004లో జరిగిన లోక్సభ ఎన్నికల తర్వాత ఆయన తన ఓటు హక్కును వినియోగించుకోలేదు. పదేళ్ళ నుంచి ఆయన నగరానికి రాలేదు. లక్నో నుంచి ఆయన ఐదుసార్లు ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం ఆయన వయసు 92 సంవత్సరాలు.
వాజ్పేయ్ కొంత కాలంగా మంచానికే పరిమితమయ్యారని కుటుంబసభ్యులు చెబుతున్నారు. అయితే పార్టీ నేతలు కూడ అప్పుడప్పుడూ వాజ్పేయ్ను పరామర్శిస్తుంటారు.