వాలెంటైన్స్ డే మనకొద్దు.. ఆరోజున అమ్మానాన్నలతో గడపండన్న కలెక్టర్
ప్రేమికులకు షాక్ ఇస్తూ మధ్యప్రదేశ్ లోని ఛింద్వారా జిల్లా కలెక్టర్ జేకే జైన్ ‘వాలెంటైన్స్ డే’కు సంబంధించి సంచలనాత్మక ఆదేశాలు జారీ చేశారు.
ఛింద్వారా(మధ్యప్రదేశ్): ప్రేమికులకు షాక్ ఇస్తూ ఒక జిల్లా కలెక్టర్ 'వాలెంటైన్స్ డే'కు సంబంధించి సంచలనాత్మక ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 14వ తేదీన మన యువతీయువకులు ఎవరూ ప్రేమికుల దినోత్సవంగా పేర్కొనే వాలెంటైన్స్ డేను జరుపుకోవద్దంటూ ఉత్తర్వులిచ్చారు.
మధ్యప్రదేశ్ లోని ఛింద్వారా జిల్లా కలెక్టర్ జేకే జైన్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. పాశ్చాత్య సంస్కృతి నుంచి అరువు తెచ్చుకున్న ప్రేమికుల దినోత్సవాన్ని పక్కన పెట్టి.. ఫిబ్రవరి 14న యువత తమ తల్లిదండ్రులతో గడపాలని, వారిని ప్రేమపూర్వకంగా చూసుకోవాలని ఉద్భోధించారు.
ఫిబ్రవరి 14 ను మాతృపితృ పూజా దినోత్సవంగా పాటించాలని కలెక్టర్ జైన్ కోరారు. ప్రతి ఇంట్లోనూ, మరీ ముఖ్యంగా విద్యాసంస్థలు, సామాజిక సేవా సంస్థలు ఆ రోజును మాతృపితృ పూజా దినోత్సవంగా నిర్వహించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
అయితే కలెక్టర్ ఆదేశాలపై యువతీయువకులు భిన్నంగా స్పందించారు. కొంతమంది ఆయన తీరును తప్పుబట్టగా.. మరికొంతమంది ఒక మంచి మార్పు కోసమే ఆయన ఈ రకంగా ఆదేశాలు జారీ చేశారని పేర్కొంటూ పొగడ్తలతో ముంచెత్తారు.
Madhya Pradesh: Chhindwara collector issues notice, asking people to worship their parents on Valentine's Day. pic.twitter.com/UljAQZlEFC
— ANI (@ANI_news) February 10, 2017