మరో భారతీయుడి ఇంటిపై దాడి: అసహ్యానికి పాల్పడ్డారు, వెళ్లిపోండంటూ పోస్టర్లు
తాజాగా మరో భారతీయుడి ఇంటిపై దాడి చేసి, తమ విద్వేషాన్ని చాటుకున్నారు. దక్షిణ కొలరాడోలో జరిగిన ఈ దాడిపై ఎఫ్బీఐ దర్యాప్తు ప్రారంభించింది.
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుంచి అమెరికాలో భారతీయులపై జాతి విద్వేష దాడులు వరుసగా జరుగుతున్నాయి. గత కొద్ది రోజుల క్రితం వంశీ, ఐదు రోజుల క్రితం శ్రీనివాస్ కూచిభొట్ల.. జాత్యహంకార అమెరికన్ల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మరో తెలుగు వ్యక్తి అలోక్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి.
మతిలేని హింస: తెలుగువారిపై దాడిపై సత్య నాదెళ్ల
కాగా, తాజాగా మరో భారతీయుడి ఇంటిపై దాడి చేసి, తమ విద్వేషాన్ని చాటుకున్నారు. దక్షిణ కొలరాడోలో జరిగిన ఈ దాడిపై ఎఫ్బీఐ దర్యాప్తు ప్రారంభించింది. ఘటన వివరాల్లోకి వెళితే.. పీటన్ నగరంలోని ఓ భారతీయుడి ఇంటిపై దాడికి దిగిన గుర్తుతెలియని వ్యక్తులు కొందరు గోడలపై కోడిగుడ్లు విసిరి, కుక్కల అశుద్ధం పూసి, విద్వేష వ్యాఖ్యలతో కూడిన పోస్టర్లు అంటించారు.
'గోధుమ రంగు చర్మం వాళ్లు, లేదా భారతీయులు ఇక్కడ ఉండొద్దు' అనే అర్థవం వచ్చేలా పోస్టర్లపై రాశారు. అయితే, ఈ దాడికి గురైన భారత సంతతి వ్యక్తి తన పేరును బయటపెట్టేందుకు మాత్రం ఇష్టపడలేదు. కెమెరా ముందుకు కూడా రాలేదు. అంతేగాక, ఎవరో ఒకరిద్దరు మాత్రమే ఇలా విద్వేషంగా ఉన్నారే తప్ప.. అమెరికన్లంతా అలాంటి వారు కాదని చెప్పారు.
నా ప్రశ్నలకు బదులేది?: కన్నీటి పర్యంతమైన శ్రీనివాస్ భార్య సునయన(వీడియో)
తన ఇంటి చుట్టుపక్కల వాళ్లంతా తనకు సాయం వచ్చి, ఇంటి గోడలను శుభ్రం చేశారని తెలిపారు. కానీ, మళ్లీ ఎక్కడ తన మీద దాడి జరుగుతుందోనన్న ఆందోళనను మాత్రం ఆయన వ్యక్తం చేయడం గమనార్హం. కాగా, ఘటనపై విచారణ ప్రారంభించిన పోలీసులు.. ఇది ఒకరిద్దరి పని అయివుండదని, పెద్ద సమూహమే వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు.