రాజ్యసభ ఉపసభాపతి ఎన్నికలు: విపక్షాల అభ్యర్థిగా ఎన్సీపీ ఎంపీ వందన చవాన్..?
రాజ్యసభ ఉపసభాపతి ఎన్నికకు విపక్ష పార్టీల నుంచి అభ్యర్థిగా ఎన్సీపీ ఎంపీ వందన చవాన్ను ప్రతిపాదించే అవకాశం ఉంది. విపక్షపార్టీల సమావేశంలో బహుజన్ సమాజ్ వాదీ పార్టీ సతీష్ మిశ్రా, తృణమూల్ కాంగ్రెస్ డెరిక్ ఓ బ్రయాన్లు ఉపసభాపతి పదవికి వందన పేరు ప్రతిపాదించారు.పార్లమెంటులో కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ గదిలో ఈ సమావేశం జరిగింది. వందన చవాన్కు మద్దతు ఇవ్వాల్సిందిగా బిజూజనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్, శివసేన పార్టీలను ఆజాద్ కోరనున్నట్లు తెలుస్తోంది.
Recommended Video
57 ఏళ్ల చవాన్ మహారాష్ట్ర నుంచి పెద్దల సభకు రెండో సారి ఎన్నిక కావడం విశేషం. 2012 నుంచి ఆమె రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. ఆమె సోదరి వినిత కామ్టే 2008 ముంబై దాడుల్లో వీరమరణం పొందిన పోలీస్ అధికారి అశోక్ కామ్టేను వివాహమాడారు. ఇదిలా ఉంటే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ నుంచి రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ అభర్థిగా జేడీయూ ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్ను ప్రతిపాదించింది. జేడీయూ అభ్యర్థి ఎంపికపై శిరోమణి అకాళీదల్ బీజేపీపై గుర్రుగా ఉంది. ముందుగా తమ అభ్యర్థి నరేష్ గుజ్రాల్ పేరును ప్రతిపాదించి సిద్దంగా ఉండాలని చెప్పి... చివరి నిమిషంలో జేడీయూ అభ్యర్థిని ప్రతిపాదించడం తమకు నచ్చలేదని శిరోమణి అకాలీదళ్ చెబుతోంది.
ఇక ఆగష్టు 9న జరగనున్న ఉపసభాపతి ఎన్నికలకు అధికార విపక్ష పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. ఇప్పటి వరకు ఎన్డీఏకు 93 మంది అభ్యర్థుల మద్దతు ఉండగా.. విపక్షాలకు 118 మంది ఎంపీల మద్దతు ఉంది. అయితే అధికార ఎన్డీఏ కూటమి మాత్రం మరో 33 మంది మద్దతు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అన్నాడీఎంకేతో బీజేడీతో మద్దతు ఇవ్వాల్సిందిగా మంతనాలు జరుపుతోంది. మరోవైపు అధికార పార్టీ నుంచి అసంతృప్తితో ఉన్న ఎంపీలు క్రాస్ ఓటింగ్కు పాల్పడే అవకాశం ఉండటంతో వారి వైపు ఆశగా ఎదురు చూస్తున్నాయి విపక్ష పార్టీలు. జూన్ 30న డిప్యూటీ ఛైర్మెన్గా ఉన్న కురియన్ పదవీకాలం ముగియడంతో ఆ స్థానం ఖాళీగా ఉంది. కొద్ది రోజుల వ్యవధిలోనే అధికార విపక్ష పార్టీల మధ్య ఓట్ల పోరు రెండో సారి జరగనుంది. గత నెలలో మోడీ సర్కార్పై అవిశ్వాస తీర్మానం పెట్టి ఓటమి చూసిన విపక్షాలు... ఈసారి ఉపసభాపతి స్థానాన్ని కైవసం చేసుకుని సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతున్నాయి.