వందే భారత్-2: 31 దేశాల నుంచి 32వేల మందికిపైగా భారత్కు, 149 విమానాలు
న్యూఢిల్లీ: వందే భారత్ మిషన్లో భాగంగా విదేశాల్లో చిక్కుకుపోయిన పలువురు భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మే 16వ తేదీ నుంచి రెండో దశలో 149 విమానాలను నడపనుంది. ఈ నేపథ్యంలో ఆయా విమానాల్లో టికెట్స్ బుకింగ్స్ ప్రారంభించింది. 31 దేశాల నుంచి సుమారు 32వేల మందికిపైగా తిరిగి దేశానికి తీసుకురానుంది.
ఆ రెండు దేశాల నుంచి హైదరాబాద్ చేరుకున్న 312 మంది భారతీయులు
మొదటి దశలో 64 విమానాలను నడిపిన ఎయిరిండియా ఇప్పుడు ఆ సంఖ్యను దాదాపు రెట్టింపు చేసింది. తాజాగా పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ పూరి ట్విట్టర్ వేదికగా దీనిపై స్పందించారు. 'ఆశ, సంతోషం నినాదాలుగా మిషన్ వందే భారత్ కొనసాగుతోంది. ఇప్పటి వరకూ 11 విమానాల్లో దాదాపు 2171 మంది ప్రయాణికులు భారత్కు వచ్చారు. బహ్రెయిన్, న్యూయార్క్, మనీలా, దుబాయ్, మస్కట్, సింగపూర్, ఢాకా, కౌలాలంపూర్ నుంచి వీరంతా వచ్చారు' అని వెల్లడించారు.
ఈ నేపథ్యంలోనే వందే భారత్ ఫేజ్-2లో భాగంగా బుకింగ్స్ ఓపెన్ చేసినట్లు ఎయిరిండియా ప్రకటించింది. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, ఫ్రాంక్ఫర్ట్, ప్యారిస్, సింగపూర్, కెనడాలలోని ఎంపిక చేసిన ప్రాంతాల నుంచి విమాన రిజర్వేషన్లు ప్రారంభించినట్లు తెలిపింది. మొదటి దశలో కేవలం ఢిల్లీలోనే ల్యాండ్ అయిన విమానాలు.. రెండో దశలో దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లోనూ ల్యాండ్ అవుతాయని తెలుస్తోంది.
ఇది ఇలావుంటే, ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో, మాస్కో, ఫ్రాంక్ఫర్ట్, ప్యారిస్, చికాగో, సింగపూర్, వాషింగ్టన్, రియాద్, లండన్, వాంకోవర్, మెల్బోర్న్, జెడ్డా, సిడ్నీ, టొరంటో, అబుదాబీ, ఢాకా, బ్యాంకాక్, కౌలాలంపూర్, ఖాట్మాండ్, రోమ్, మస్కట్, తిబ్లిసిలకు కూడా విమానాలు నడుపుతున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. కాగా, ఇప్పటి వరకు స్వదేశానికి వచ్చేందుకు 1,88,646 మంది భారతీయులు రిజిష్టర్ చేసుకున్నట్లు సమాచారం.