స్వదేశీ పరిజ్ఞానం హైస్పీడు రైలు వందే భారత్ ఎన్ని కిలోమీటర్లు పూర్తిచేసిందో తెలుసా..?
పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన వందేభారత్ ఎక్స్ప్రెస్ లక్ష కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేసింది. అది కూడా ఒక్క ట్రిప్పు కూడా రద్దు కాకుండా లక్ష కిలోమీటర్లు పూర్తి చేయడం విశేషం. ఈ విషయాన్ని ఓ రైల్వేశాఖ ఉన్నతాధికారి వెల్లడించారు. న్యూఢిల్లీ నుంచి వారణాసికి వెళ్లే ఈ రైలును ఫిబ్రవరి 15న ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించారు. గత మూడునెలల్లో ఒక్కసారి కూడా రైలు రద్దు కాలేదని ఆయన తెలిపారు.
ఇదిలా ఉంటే ఫిబ్రవరి 15న వారణాని నుంచి న్యూఢిల్లీకి తిరిగి వస్తున్న క్రమంలో కాన్పూర్ వద్ద సాంకేతిక కారణాలతో ఆగిపోయింది. ఇక తొలి కమర్షియల్ ప్రయాణం మాత్రం ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం అయ్యింది. ఈ రైలు రావడంతో త్వరలోనే శతాబ్ది ఎక్స్ప్రెస్ రైలుకు గుడ్ బై చెప్పేయనున్నారు. ఈ హైస్పీడ్ రైలును చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ తయారు చేసింది. ఇందులో అన్ని సదుపాయాలు ఉన్నాయి. ప్రయాణికులకోసం వైఫై జీపీఎస్ వ్యవస్థ, బయో వాక్యూమ్ టాయ్లెట్స్, ఎల్ఈడీ లైటింగ్లు, మొబైల్ చార్జింగ్ పాయింట్లు లాంటి వాటితో పాటు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా టెంపరేచర్ అడ్జెస్ట్ చేసే ఫెసిలిటీలు ఉన్నాయి.
మొత్తం 16 కోచ్లు ఉన్న ఈ వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలులో రెండు ఎగ్జిక్యూటివ్ కంపార్ట్మెంట్లు ఉన్నాయి.ఒక్కో కంపార్ట్మెంట్లో 52 సీట్లు ఉన్నాయి.ఇక సాధారణ కోచ్లలో 78 సీట్లు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ కోచ్లలో రైలు ఏ దిశలో అయితే ప్రయాణిస్తుందో ఆ దిశకు సీట్లు మరలుతాయి. ఇక ఈ రైలు అందుబాటులోకి రావడంతో న్యూఢిల్లీ నుంచి వారణాసికి ప్రయాణ సమయం కూడా తగ్గింది.