ఇగ్నో నుంచి గోల్డ్మెడల్ సాధించిన ఖైదీ
న్యూఢిల్లీ/వారణాసి: ఓ ఖైదీ తన ప్రతిభకు పదును పెట్టి అరుదైన గౌరవాన్ని పొందాడు. వారణాసి జైలులో ఉన్న ఓ 23 ఏళ్ల ఖైదీ.. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో) నుంచి డిప్లొమా ఇన్ టూరిజం స్టడీస్లో బంగారం పతకం సాధించి అందరి నుంచి ప్రశంసలు అందుకున్నాడు.
హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న అజిత్కుమార్ సరోజ్ బనారస్ హిందూ యూనివర్సిటీలో డిప్లొమా పూర్తి చేశాడు. ఇగ్నో 28వ స్నాతకోత్సవం సందర్భంగా అతడికి శనివారం అవార్డు ప్రదానం చేశారు.
డాక్టర్ రాం మనోహర్ లోహియా అవద్ విశ్వవిద్యాలయం వైస్చాన్స్లర్ జీసీ జైస్వాల్ అతడికి బంగారు పతకం అందిస్తూ ఇగ్నో రూపొందించిన అజిత్ బయోడేటా చదివి వినిపించారు. హత్యకేసులో పదేళ్ల శిక్ష పడిన అజిత్ 2012 నుంచి వారణాసి జైలులో ఖైదీగా ఉన్నాడు.
ఈ క్రమంలో ఇగ్నో అందిస్తున్న ఏడాది కోర్సు డిప్లొమా ఇన్ టూరిజం స్టడీస్పై దృష్టిపెట్టిన అజిత్ సబ్జెక్టులో టాపర్గా నిలిచాడు. ఇగ్నో వారణాసి 20 జిల్లాల పరిధిలో 6వేల మంది విద్యార్థులు చదువుతుండగా బంగారు పతకం సాధించిన తొలిఖైదీ అజిత్ అని రీజియన్ డైరెక్టర్ ఏఎన్ త్రిపాఠి వెల్లడించారు. కాగా, గోల్డ్ మెడల్ సాధించడం పట్ల ఖైదీ కుటుంసభ్యులు, బంధువులు ఆనందం వ్యక్తం చేశారు.