ప్రధాని మోడీకి షాకిచ్చిన సొంత నియోజకవర్గం ఓటర్లు: జనంతో రోడ్లు కిటకిట: నో సోషల్ డిస్టెన్సింగ్.. !
లక్నో: ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి.. ఆయన సొంత నియోజకవర్గం వారణాసి ఓటర్లు షాక్ ఇచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా అమలు చేస్తోన్న లాక్డౌన్ను ఈ నెల 20వ తేదీ వరకు మరింత కఠినతరం చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వార్నింగ్ ఇచ్చిన రోజే.. నగర వీధుల్లో స్వేచ్ఛగా తిరుగాడుతూ కనిపించారు. మోడీ పదే, పదే కలవరించే సోషల్ డిస్టెన్సింగ్ నినాదాన్ని పక్కన పెట్టారు. ఉత్తర ప్రదేశ్లోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం వారణాసి లోక్సభ నియోజకవర్గానికి నరేంద్ర మోడీ ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న విషయం తెలిసిందే.
ప్రధాని ప్రసంగం ముగిసిన వెంటనే..
మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించిన చేసిన ప్రసంగం ముగిసిన కొద్దిసేపటికే స్థానికులు పెద్ద ఎత్తున రోడ్ల మీదికి చేరుకున్నారు. తమ రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నం అయ్యారు. వారణాసి లోక్సభ పరిధిలోని మదన్పురా ప్రాంతంలో ప్రజలు గుంపులు గుంపులుగా తిరుగాడటం కనిపించింది. ఈ సందర్భంగా వారు తమ ముఖానికి మాస్కులు ధరించి ఉన్నప్పటికీ.. సామాజిక దూరాన్ని పాటించలేదు.మదన్పురా ప్రాంతంలో పలు దుకాణాలు తెరిచే ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా
లాక్డౌన్ నిబంధనలు కొనసాగుతున్నప్పటికీ.. స్థానికులు పెద్దగా దాన్ని ఖాతరు చేయట్లేదని అంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మధ్యాహ్నం వరకూ అన్ని రకాల దుకాణాలను తెరిచి ఉంచుతున్నారని, ప్రజలు తమ అవసరాల కోసం, రోజువారీ కార్యకలాపాల కోసం పెద్ద సంఖ్యలో రోడ్ల మీదికి వస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇంతా జరుగుతున్నప్పటికీ.. పోలీసులు పెద్దగా పట్టించుకోవట్లేదని అంటున్నారు. ఉత్తర ప్రదేశ్లో పెద్ద ఎత్తున కరోపా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని, అయినప్పటికీ.. బాధ్యతారాహిత్యంగా ప్రజలు రోడ్ల మీదికి వస్తున్నారని అంటున్నారు.
Recommended Video
హాట్స్పాట్గా గుర్తించినా..
నిజానికి- మదన్పురా ప్రాంతాన్ని ఉత్తర ప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కరోనా వైరస్ హాట్స్పాట్గా గుర్తించింది. మదన్పురా సహా బజార్దిహ, గంగాపూర్, లోహ్తా ప్రాంతాలను హాట్స్పాట్గా గుర్తించారు. శివ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే ఈ మూడు ప్రాంతాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కావడంతో నాలుగు రోజుల కిందటే వాటిని హాట్స్పాట్గా గుర్తిస్తూ స్థానిక పోలీసులు ఉత్తర్వులను జారీ చేశారు. వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ఆయా ప్రాంతాల్లో కర్ఫ్యూను సైతం విధించారు. అయినప్పటికీ.. వాటిని బేఖాతర్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.