వరవరరావు పరిస్థితి విషమం, ఫ్యామిలీకి ముంబై పోలీసుల సమాచారం, హుటహుటిన...
విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రధాని మోడీకి కుట్ర కేసులో పుణె పోలీసులు అతనిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది నుంచి జైలులోనే ఉంచి.. బెయిల్ కూడా ఇవ్వడం లేదు. తలోజా జైలులో ఉన్న వరవరరావు ఆరోగ్యం బాగోలేకపోవడంతో జేజే ఆష్పత్రికి తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితి గురించి ముంబై పోలీసులు చిక్కడ పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే వారు వరవరరావు కుటుంబసభ్యులకు తెలియజేశారు. కరోనా వైరస్ లాక్ డౌన్ దృష్ట్యా.. వరవరరావు కుటుంబం ముంబై వెళ్లేందుకు అనుమతించామని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. వరవరరావు కుటుంబసభ్యుల ప్రయాణం ఏర్పాట్లకు సంబంధించి డీసీపీ స్థాయి అధికారి కో ఆర్డినేట్ చేస్తారని తెలిపారు.
మహారాష్ట్రలోని పుణె సమీపంలో గల భీమా-కోరెగావ్లో 2018 జనవరి 1న 'పీష్వాలపై దళితుల విజయం ద్విశతాబ్ది ఉత్సవాల నిర్వహణ సందర్భంగా హింస చెలరేగింది. ఆ హింసలో ఒక వ్యక్తి చనిపోగా, పోలీసులు సహా పలువురు గాయపడ్డారు. హింసను ప్రేరేపించారన్న ఆరోపణలపై హిందూ సంస్థల ప్రతినిధులు శంభాజీ భిడే, మిలింద్ ఏక్బోటేలపై కేసు నమోదు చేశారు. వీరు పట్టణాల్లో మావోయిస్టులని పోలీసులు ఆరోపించారు. వారి ఇళ్లలో కొన్ని ఎలక్ట్రానిక్ స్టోరేజీ పరికరాలు, సీడీలు, స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.
Recommended Video
ప్రింట్ అవుట్లను పరిశీలించగా.. రాజీవ్గాంధీ హత్య తరహాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని హత్య చేయటానికి నక్సలైట్లు కుట్ర పన్నిన విషయం వెల్లడైందని తెలిపారు. 2018 ఆగస్టు 28న.. విప్లవ రచయితల సంఘం నేత పెండ్యాల వరవరరావు సహా.. పలువురు హక్కుల కార్యకర్తలు, న్యాయవాదులు, రచయితల ఇళ్లల్లో మహారాష్ట్ర పోలీసులు సోదాలు చేశారు. హైదరాబాద్ నుంచి వరవరరావును అరెస్ట్ చేసి తమతో పాటు పుణె తీసుకెళ్లారు. భీమాకోరేగావ్ అల్లర్లకు సంబంధించి జూన్లో అరెస్టు చేసిన వారిలో కొందరు మావోయిస్టు సానుభూతిపరులు ఉన్నారని.. వారంతా ప్రధానమంత్రి మోదీ హత్యకు కుట్ర పన్నారని.. వారికి వరవరరావు ఆర్థికంగా సహకరిస్తున్నారని మహారాష్ట్ర పోలీసుల అభియోగం మోపారు
వరవరరావుపై ఐపీసీ 153 (ఏ), 505 (1) (బీ), 117, 120 (బీ), చట్ట వ్యతిరేక చర్యల (నియంత్రణ) చట్టం సెక్షన్ 13, 16, 17, 18 (బీ), 20, 38, 39, 40 సెక్షన్ల కింద మహారాష్ట్ర పుణె జిల్లా విశారంబాగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇక అప్పటినుంచి వరవరరావు జైలులోనే ఉన్నారు. బెయిల్ కోసం దరఖాస్తు చేసిన ఇవ్వలేదు.