రానున్న రోజుల్లో మరిన్ని కరోనా వేరియంట్లు, వ్యాక్సిన్లు పనిచేయకపోవచ్చు: డబ్ల్యూహెచ్ఓ సైంటిస్ట్
నెనీవా/న్యూఢిల్లీ: భారతదేశంలో విస్తరిస్తున్న కరోనావైరస్ రకానికి వేగంగా వ్యాపించే లక్షణం ఉందని, అంతేగాక, వ్యాక్సిన్తో ఏర్పడే రోగనిరోధకతను కూడా ఇది తప్పించుకునే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ పేర్కొన్నారు.
Recommended Video
రానున్న రోజుల్లో మరిన్ని కరోనా రకాలు.. భారీ ముప్పే..
కరోనా వ్యాపిస్తున్న కొద్దీ కొత్త రకాలు వెలుగులోకి వస్తూనే ఉంటాయని అన్నారు. భారీ స్థాయిలో రూపాంతరం చెందిన వైరస్ రకాలపై వ్యాక్సిన్లు పెద్దగా పనిచేయకపోవచ్చని అభిప్రాయపడ్డారు. అదే జరిగితే మరోసారి ప్రపంచానికి భారీ ముప్పు తప్పకపోవచ్చని వ్యాఖ్యానించారు.
నిర్లక్ష్యంతోనే భారత్లో కరోనా విజృంభణ
ఇక గత అక్టోబర్ నెలలో గుర్తించిన బీ.1.617 రకమే దేశంలో ప్రస్తుత మహమ్మారి విలయానికి కారణమని స్పష్టం చేశారు. అయితే, భారత్లో కరోనా ఉధృతికి కరోనా కొత్త రకాలు ఒక్కటే కారణం కాదని స్వామినాథన్ అన్నారు. ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ప్రజలు భారీ సంఖ్యలో గుమిగూడేందుకు భారీ స్థాయిలో సమావేశాలకు అనుమతి ఇవ్వడం వల్ల కరోనా పోరులో భారత్ ఒక రకంగా నిర్లక్ష్యం వహించినట్లయిందని స్వామినాథన్ అభిప్రాయపడ్డారు. వైరస్ వ్యాప్తి ముగిసిందని పొరబడిన ప్రజలు మాస్కకులు ధరించడం, భౌతిక దూరం పాటించడం లాంటి నిబంధనలను విస్మరించారని వ్యాఖ్యానించారు.
వ్యాక్సినేషన్ తోపాటు కరోనా నిబంధనలు పాటిస్తేనే..
భారత్ వంటి భారీ జనాభా ఉన్న దేశాల్లో కరోనా వ్యాప్తి నెమ్మదిగా ఉండాల్సిందని, తొలి రోజుల్లో అలానే ఉందన్నారు. అయితే, ఒక్కసారిగా కేసులు పెరగడం ప్రారంభమైందని, ఆ తర్వాత వైరస్ విలయాన్ని కట్టడి చేయడం కష్టంగా మారిందన్నారు సౌమ్య స్వామినాథన్. భారత్లో వ్యాక్సిన్ తయారీపై భారీ ఎత్తున చర్యలు చేపడుతున్న నేపథ్యంలో కేవలం వ్యాక్సినేషన్ వల్ల పరిస్థితిని అదుపులోకి తీసుకురాలేని స్వామినాథన్ అభిప్రాయపడ్డారు. సుమారు 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో కేవలం రెండు శాతం మందికి మాత్రమే టీకా అందిందన్నారు. 70-80 శాతం మందికి కరోనా టీకా అందాలంటే సంవత్సరాలు కాకపోయినా కొన్ని నెలలైనా పడుతుందని తెలిపారు. అందుకే ప్రజలంతా కరోనా నిబంధనలను పాటిస్తే మహమ్మారిని కొంతవరకు కట్టడి చేయవచ్చన్నారు. గత కొద్ది రోజులుగా భారత్లో ప్రతి రోజు 4 లక్షలకుపైగా కేసులు, 3వేలకు పైగా మరణాలు సంభవిస్తున్న విషయం తెలిసిందే.